తెలంగాణ ద్రోహి: బాబుపై కవిత, టిడిపి నామరూపాలు లేకుండా..
నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, తెలంగాణ ద్రోహి అని ధ్వజమెత్తారు. శుక్రవారం టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కవిత మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ను దేశం గర్వించదగ్గ నాయకున్ని చేసింది కార్యకర్తలే అని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలందరికీ సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నామరూపం లేకుండా చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఏపీ పోలీస్ అకాడమీ పేరు మార్పు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ పేరు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీగా పేరు మార్పు చేసింది. నిజాం రాజ్యంలో కోత్వాల్గా విధులు నిర్వహించిన రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి హైదరాబాద్లో రెడ్డి హాస్టల్, రెడ్డి కాలేజ్తో పాటు తెలంగాణ జిల్లాల్లో బాలికల పాఠశాలలను నెలకొల్పి వారి విద్యాభ్యాసం కోసం కృషి చేశారు.
హైదరాబాద్లో పలు స్వచ్చంద సంస్థలు, కళాశాలల ఏర్పాటులో రాజాబహదూర్ వెంకటరాంరెడ్డి తన సహాకారాన్ని అందించారు. వెంకటరాంరెడ్డి రెడ్డి బాలికల పాఠశాలను నెలకొల్పారు. ఆ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు మీడియం పాఠశాలకు గుర్తింపు ఇవ్వడం లేదు. దీంతో రాంరెడ్డి పుణేకు చెందిన కార్వే సంస్థ నుంచి ఈ పాఠశాలకు గుర్తింపు పొందారు. నిజాం రాష్ట్రంలో నెలకొల్పిన చాలా విద్యాసంస్థల్లో రాంరెడ్డి ఫౌండర్ మెంబర్గా ఉన్నారు.
ఆయన బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వితంతు పునర్ వివాహాలను ప్రోత్సహించారు. వెంకటరాంరెడ్డి తన సంపాదనను మొత్తం విద్యాసంస్థల ఏర్పాటు, దానధర్మాలకు కేటాయించేవారు. 1953లో వెంకటరాంరెడ్డి మరణించారు. ఆయన మరణించేనాటికి రాంరెడ్డి చేతిలో రూ. 30 మాత్రమే ఉన్నాయని చెప్పుకుంటారు.












Click it and Unblock the Notifications