కేసీఆర్ ఆరోగ్యం, హరీష్ అలకపై కవిత: బీజేపీతో దోస్తీ, బాబుపై ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రముఖ తెలుగు టీవీ చానళ్ల ముఖాముఖి కార్యక్రమంలో... తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోగ్యం, మంత్రులు హరీష్ రావు - కేటీ రామారావుల మధ్య విభేదాలు, తనకు కేంద్రమంత్రి వస్తుందనే పలు ఊహాగానాల పైన స్పందించారు.
తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమించాలనే చర్చ పార్టీలో లేదా, ఇంట్లో చర్చ జరగలేదన్నారు. హరీష్ రావు ఎవరి పట్ల అసంతృప్తితో లేరని చెప్పారు. తమ పార్టీలో లేదా తమ కుటుంబంలో విభేదాలు లేవని చెప్పారు. హరీష్ రావు, కేటీఆర్లు ఎవరికి వారే నిరూపించుకుంటున్నారని చెప్పారు.
కేసీఆర్ ఆరోగ్యంపై స్పందిస్తూ... కేసీఆర్ ఆరోగ్యం పైన ఇటీవల కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా ఆధ్యాత్మిక సమావేశాలకు వెళ్లినప్పుడు తాను ఉన్నా లేకున్నా అని మాట్లాడుతారని, కేసీఆర్ కూడా అలాగే మాట్లాడారని చెప్పారు. వందకు వెయ్యి శాతం కేసీఆర్ ఆరోగ్యం బాగుందన్నారు.
ఇతర పార్టీల నుండి ప్రజాప్రతినిధులను చేర్చుకునే అంశంపై మాట్లాడుతూ.. ఉద్యమం సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వారిని కొందర్ని స్థానిక పరిస్థితులను బట్టి చేర్చుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. అయితే, వారి చేరిక వల్ల పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
అందరి అభిప్రాయాలు తీసుకొని వారిని చేర్చుకుంటున్నామని చెప్పారు. కేసీఆర్ బాగా పని చేస్తున్నారని ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్నందున, ఇతర పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు దృష్టా తమ పార్టీలోకి వస్తున్నారని, అయితే ఎవరు వచ్చినా తమ అంతిమ లక్ష్యం ప్రజల బాగే అన్నారు.
తనకు కేంద్రమంత్రి పదవి వస్తుందనే ఊహాగానాలపై స్పందిస్తూ... తాను జాగృతి నేతగా, నిజామాబాద్ ఎంపీగా ఎప్పటికీ ఉంటానని, మిగతా ఏం వచ్చినా అదనమే అన్నారు. అయితే, కేంద్రమంత్రి పదవి విషయమై చర్చ అనేది అంతా వట్టిదే అన్నారు.
తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా మరో ఇరవై ఏళ్ల పాటు కేంద్రంతో సఖ్యతంగా ఉండాలన్నారు. అందులో భాగంగానే తాను బీజేపీకి అనుకూలంగా ఉన్నానని చెప్పారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ల మధ్య మంచి సంబంధాలున్నాయని చెప్పారు. భవిష్యత్తులోను కొనసాగుతాయన్నారు.
తెలంగాణకు ఏపీతో ఏమాత్రం పోటీ కాదని చెప్పారు. అభివృద్ధిలో నెంబర్ వన్గా ఉన్న గుజరాత్తోనే తమ పోటీ అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లి పెట్టుబడులను ఆహ్వానిస్తుంటే, తెలంగాణకు మాత్రం ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలు స్వచ్ఛంధంగా వస్తున్నారన్నారు. చంద్రబాబు సహకరించకున్నా తాము కోతల్లేని విద్యుత్ ఇస్తున్నామన్నారు.
నిజామాబాద్ కోడలిగా లేదా కేసీఆర్ కూతురిగా లేదా జాగృతి లీడర్గా.. ఇందులో దేనితో పిలిపించుకోవడం ఇష్టమని అడిగితే.. తనకు అన్ని సమానమేనని చెప్పారు. నిజామాబాద్ బిడ్డగానే తాను లోకసభలో అడుగు పెట్టానని, జాగృతి లీడర్గా బయటకు తెలిసానని చెప్పారు.