టీడీపీకి కేశినేని నాని గుడ్బై: రాజీనామా లేఖలో కీలక అంశాల ప్రస్తావన
Kesineni Nani: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కల్లోలం చోటు చేసుకుంటోంది. పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీకి ప్రతికూలంగా తయారవుతున్నాయి. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి- సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది.
విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన కొన్ని గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు.

ఈ లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి పంపించారు. తన రాజీనామాను.. తక్షణమే అమలులోకి వస్తుందనీ పేర్కొన్నారు. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తరువాతే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని నాని వివరించారు. పార్టీలో కొనసాగకూడదనే ఉద్దేశంతో ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు తెలిపారు.
పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగానని, ఎదగడానికి అగ్రనాయకత్వం తనకు అవకాశాలను కల్పించిందని కేశినేని నాని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలు, ఇతరత్రా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీని వీడాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారాయన. ఇన్నాళ్లూ తనకు సహకరించిన పార్టీ అగ్రనాయకత్వం, తోటి సభ్యులు, కార్యకర్తలకు నాని కృతజ్ఞతలు తెలిపారు.
ఆయన కుమార్తె, విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేశినేని శ్వేత ఇదివరకే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్బై చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్గా గెలిచిన ఆమె తన పదవికి కూడా రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications