పెద్దిరెడ్డి ఫైల్ నా దగ్గర ఉంది.. పవన్ దీక్షలో ఉంటూ అబద్ధాలు చెప్పొచ్చా?
Pawan Kalyan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి తనయుడు, లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఎర్రచందనం స్మగ్లింగ్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయంటూ విమర్శించారు. ఆయనపై నేపాల్ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు.
దీన్ని మిథున్ రెడ్డి తోసిపుచ్చారు. అయిదు సంవత్సరాల పాటు పవన్ కల్యాణ్ అధికారంలో ఉండబోతోన్నారని, తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు. పోలీసులు, ఇతర వ్యవస్థలన్నీ కూడా పవన్ కల్యాణ్ చేతిలో ఉన్నాయని గుర్తు చేశారు.

కాకినాడ జిల్లా పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో పవన్ కల్యాణ్.. ఈ ఆరోపణలు చేశారు. తిరుపతి నుంచి పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేపాల్కు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారంటూ విమర్శించారు. ఫారెస్ట్ చెక్పోస్టుల్లో పెద్దిరెడ్డి వాహనాలకు ఎలాంటి అడ్డూ ఉండట్లేదని, ఆయన పేరు చెబితే సిబ్బంది వదిలేస్తారని చెప్పారు.
దేశంలో గల ఇన్ని చెక్పోస్టులను దాటుకుని ఎర్రచందనం వాహనాలు నేపాల్ సరిహద్దుల వరకు ఎలా వెళ్లగలుగుతున్నాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పెద్దిరెడ్డి ఎవరో తెలియకపోవడంతో నేపాల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫైల్ తన వద్దకు వచ్చిందని అన్నారు. పట్టుబడ్డ ఎర్రచందనాన్ని నేపాల్ నుంచి తీసుకు రావాల్సి ఉందని చెప్పారు.
ఈ ఆరోపణలను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తోసిపుచ్చారు. దీక్షలో ఉంటూ ఇంత అలవోకగా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం తమపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని నిలదీశారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారని, పోలీసులు, వ్యవస్థలు మొత్తం ఆయన చేతిలో ఉన్నాయని గుర్తు చేశారు.
పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని మిథున్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మాత్రమే కాదు.. 25 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే తాను ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. సత్యశోధనకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పవన్కు అయిదేళ్లపాటు సమయం ఉందని, ఈలోగా ఆరోపణలను నిరూపించలేకపోతే బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి సిద్ధమేనా? అంటూ సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications