గుంటూరు అర్బన్ ఎస్పీకి రఘురామకృష్ణరాజు న్యాయవాది కోర్టు ధిక్కార నోటీసులు
హైదరాబాద్/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు రాజద్రోహం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రఘురామకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ లోపే ఏపీ పోలీసులు రఘురామను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది ఆరోపించారు.
గుంటూరు అర్బన్ ఎస్పీకి రఘురామ లాయర్ నోటీసులు
రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తీసుకురావాలని ఎస్కార్ట్ను ఆదేశించినట్లు తెలియడంతో ఆయన తరపు న్యాయవాది గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రఘురామ బెయిల్ పై విడుదలైనట్లేనని, విడుదలైన పది రోజులకు బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించిందని న్యాయవాది వెల్లడించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లే..
సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామను తీసుకురావాలని ఎస్కార్ట్ను పంపడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని, అందుకే నోటీసులు ఇస్తున్నట్లు రఘురామ న్యాయవాది తెలిపారు. హైదరాబాద్ నుంచి గుంటూరు అర్బన్ ఎస్పీకి నోటీసులు పంపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామని చెప్పారు. నాలుగు రోజుల అనంతరం మరోసారి ష్యూరిటీస్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు.
Recommended Video
ఆర్మీ ఆస్పత్రి కమాండర్కు రఘురామ లేఖ
ఇది ఇలావుండగా, ఆర్మీ ఆస్పత్రి కమాండర్కు రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వాడుతున్నట్లు తెలిపారు. తన కాలి నొప్పి ఇంకా తగ్గలేదని, బీపీలో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని లేఖలో రఘురామ పేర్కొన్నారు. నోరు కూడా తరచుగా పొడారుతోందని, రెండు మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే డాక్టర్ల పర్యవేక్షణలోనే తనకు చికిత్స అందించాలని కోరారు. ఒకవేళ డిశ్చార్జ్ చేయాలనుకుంటే డిశ్చార్జ్ సమ్మరీలో తన ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏపీకి చెందిన కొందరు పోలీసులు ఆస్పత్రి దగ్గర ఉన్నట్లు తెలిసిందని రఘురామ పేర్కొన్నారు. కాగా, మరికొద్ది రోజులపాటు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.