వైఎస్ జగన్ అప్పుడలా.. ఇప్పుడిలా..: ప్రజా తీర్పును దుర్వినియోగం చేయొద్దంటూ రఘురామ
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు సమస్యలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాసిన రఘురామ.. తాజాగా మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఈసారి అమరావతి రాజధాని అంశాన్ని లేవనెత్తారు.
సీఎం జగన్ అప్పుడలా.. ఇప్పుడిలా..
సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని అన్నారని రఘురామ తెలిపారు. ఇప్పటికే నవ హామీలు, వైఫల్యాల పేరుతో సీఎంకు తొమ్మిది లేఖలు రాసిన ఎంపీ.. ఇప్పుడు నవ ప్రభుత్వ కర్తవ్యాలంటూ మరో 9 లేఖలు రాస్తానని చెప్పారు.
జగన్ నాటి నిర్ణయాన్ని మార్చుకోవద్దంటూ రఘురామ
పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలోనూ అమరాతిపై జగన్ హామి ఇచ్చారని రఘురామ గుర్తు చేశారు. కనీసం 30 వేల ఎకరాల్లో రాజధాని ఉండాలని సూచించారని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకోవడం సరికాదని సీఎం జగన్కు రఘురామ హితవు పలికారు. ప్రజలు ఇచ్చిన తీర్పును దుర్వినియోగం చేయొద్దని కోరారు.
రాష్ట్రంపై ఆర్థిక భారం పెంచొద్దు..
మూడు రాజధానులపై సీఎం నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసిందని రఘురామ పేర్కొన్నారు. అమరావతికి భవిష్యత్తు లేకుండా చేశారని వాపోయారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయన్నారు. ఈ మూడు కార్యకలాపాలు ఒకే చోట ఉంటేనే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు.
రైతుల ఆందోళనలను పట్టించుకోరా?
ప్రపంచ స్థాయి హరిత నగరంగా తీర్చిదిద్దాలని కోరుతూ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు 550 రోజులుగా ఆందోళన చేస్తున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ పలువురు రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
రాజద్రోహం కేసులు అరెస్టైన రఘురామ కృష్ణరాజు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రమంత్రులు, లోక్సభ స్పీకర్, ఇతర ఎంపీలకు లేఖలు రాశారు. తనను అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేశారని ఏపీ సర్కారుపై ఫిర్యాదులు చేశారు. దీంతో పలువురు ఎంపీలు ఏపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ పట్ల వ్యవహరించాల్సిన పద్ధతి ఇది కాదంటూ హితవు పలికారు.