"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు".. ప్రైవేటీకరణ ఒప్పుకోం : కేంద్రానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు అల్టిమేటం
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించింది . జనవరి 27వ తేదీన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర కూడా వేసినట్లుగా కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటీకరించడానికి కేంద్రం సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అంటూ కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
బాబాయ్ అరెస్ట్ పై భగ్గుమన్న అబ్బాయ్ .. రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్
నిర్మలా సీతారామన్ కు లేఖ రాసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తేల్చి చెప్తున్నారు. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నా వైసీపీలో ఉన్న 28 మంది ఎంపీలు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అని రామ్మోహన్ నాయుడు నిలదీశారు. తక్షణమే కేంద్రం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం కోసం సుదీర్ఘ పోరాటాలు జరిగిన సందర్భాలను తన లేఖ ద్వారా కేంద్రానికి తెలిపారు.
దశాబ్ద కాలంపాటు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమం .. ప్రైవేటీకరణ ఒప్పుకోం
1966 తర్వాత దశాబ్దకాలంపాటు "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అనే నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటం చేశారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అంతేకాదు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 32 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని 64 గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేయడంతో పాటుగా 22 వేల ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్నారని గుర్తు చేశారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో పార్లమెంట్ లో అడ్డుకున్న ఎర్రన్నాయుడు .. ఆయన స్పూర్తితో అడ్డుకుంటా
విశాఖ ఉక్కు కర్మాగారానికి కాపాడటం కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధమేనని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను పార్లమెంట్లో అప్పటి ఎంపీ ఎర్రన్నాయుడు గట్టిగా అడ్డుకున్నారని, ఇప్పుడు అదే స్ఫూర్తితో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను తాను అడ్డుకుంటానని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. నవరత్న హోదా ఉన్న గొప్ప సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం అని, అది నష్టాల్లోకి రావడానికి గల కారణాలను తెలుసుకొని, లాభాల బాట పట్టడానికి పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు .
కేంద్ర నిర్ణయం ఉపసంహరించుకోకుంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధం
అలా కాకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పటం సమంజసం కాదని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. కేంద్రం నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ఎటువంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆర్థిక మంత్రికి లేఖ రాసి స్పష్టం చేశారు రామ్మోహన్ నాయుడు.