వైసీపీ సోషల్ టీమ్కు 2 వేల ఉద్యోగాలు- సాయిరెడ్డి హామీ- నిరుద్యోగుల్లో ఆగ్రహం
గతేడాది ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.... తమ విజయంలో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా కార్యకర్తలను విస్మరిస్తుందనే ఆరోపణలు ముందునుంచీ వినిపిస్తున్నాయి. తొలి ఏడాది ఇలాంటి విమర్శలు వినిపిస్తున్న తరుణంలో వారితో సమావేశమైన పార్టీ ఎంపీ, కీలక నేత విజయసాయిరెడ్డి దాదాపు రెండున్నర లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు వారికి ఇస్తామని ప్రకటించారు.
అనంతరం అనుకున్నట్లుగానే పార్టీలో క్షేత్రస్ధాయిలో చురుగ్గా పనిచేసిన వారిని వాలంటీర్లుగా ఎంపిక చేశారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం లెక్కచేయలేదు. ఇప్పుడు పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్లో మరో 2 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని సాయిరెడ్డి ప్రకటించడం సంచలనం రేపుతోంది.
వైసీపీ విజయంలో సోషల్ మీడియా
ఏపీలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా కార్యకర్తల పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాతో వైసీపీ చేసిన దాడి చంద్రబాబు సర్కారుకు పలుమార్లు ముచ్చెమటలు పట్టించింది. ఎన్నికలకు ముందు అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ పొరబాటున అన్న ప్రతీ మాటను పట్టుకుని వీరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
దీంతో ఇదంతా టీడీపీ సర్కారు ప్రతిష్టను ప్రజల్లో దారుణంగా దిగజార్చింది. అంతిమంగా వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టడంలో కీలకంగా మారింది. అధికారంలోకి వచ్చాక తమ విజయంలో కీలకమైన సోషల్ మీడియా టీమ్లను పట్టించుకోవడం లేదన్న విమర్శలను వైసీపీ ఎదుర్కొంది.
కార్యకర్తలకు వైసీపీ సర్కారు ఉద్యోగాలు..
వైసీపీ సోషల్ మీడియా టీమ్ల తరఫున పనిచేసిన వేలాది మంది కార్యకర్తలు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. దీంతో వీరి కోసం ఏపీ డిజిటల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని భావించినా అది సాధ్యం కాలేదు. దీంతో ఈ అసంతృప్తి మరింత పెరిగింది. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదనే ఒత్తిడి వైసీపీ సర్కారుపై పెరుగుతోంది.
దీంతో తాజాగా తాడేపల్లిలో, నిన్న విజయవాడలో వరుసగా వైసీపీ కీలక నేతలు సోషల్ మీడియా కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా విశాఖలో ఏర్పాటు చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి వారికి భారీగా ఉద్యోగాల కల్పన హామీ ఇచ్చారు.
వైసీపీ సోషల్ కార్యకర్తలకు 2 వేల ఉద్యోగాలు..
విశాఖలో జరిగిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాలో సోషల్ మీడియా కార్యకర్తలకు 2 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. విశాఖలోని పరవాడలో ఉన్న ఫార్మాసిటీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ సాయంతో ఈ ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు.
ఇందులో కోసం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తమ వివరాలు నమోదు చేయించుకుంటే విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎవరికి ఏ స్ధాయి ఉద్యోగం కల్పించాలో తాము చూసుకుంటామని సాయిరెడ్డి వారికి హామీ ఇచ్చారు. అంతే కాదు ఇప్పటివరకూ టీడీపీపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వీరిపై నమోదైన 135 కేసుల్లో 120 కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. కోర్టుల్లో ఉన్న ఏడు కేసుల్లో వైసీపీ తరఫున న్యాయ సహాయం అందిస్తామన్నారు.
Recommended Video
నిరుద్యోగుల్ని వదిలి కార్యకర్తలకు ఉద్యోగాలా ?
రాష్ట్రంలో గత టీడీపీ హయాం నుంచీ కొత్త ఉద్యోగాలు తీయడం మానేశారు. పాత ఉద్యోగాల్లో ఉద్యోగులు పదవీ విరమణ చేసినా వాటిని భర్తీ చేయడం లేదు. ఇటు ఏపీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వమే అడ్డుపుల్లలు వేస్తోంది. ఏపీలో ప్రతీ ఏటా జనవరి ప్రకటిస్తామన్న ఉద్యోగాల క్యాలెండర్ ఎటు పోయిందో తెలియదు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు మినహా మరో ఉద్యోగానికి నోటిఫికేషన్లు రావడం లేదు.
దీంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీ నేతలు తాము అధికారంలోకి రావడానికి కారణమైన సోషల్ మీడియా కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చిమరీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇస్తుండటంపై నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాలంటీర్ల ఉద్యోగాలను కార్యకర్తలకే కట్టబెట్టారు. ఇప్పుడు కాస్తో కూస్తో నైపుణ్యం ఉన్న ఉద్యోగాలను సైతం సోషల్ మీడియాకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక తమ పరిస్దితి ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.