బొత్స 95 శాతం అంటే- విజయసాయిరెడ్డి 98.44 శాతం-రాష్ట్రంలో సర్వత్రా ఇదే చర్చ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు గతంలో నవరత్నాల రూపంలో పలు హామీలు ఇచ్చింది. వాటిని అమలుచేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో రాష్ట్రం అప్పుల పాలవుతున్నా పట్టించుకోలేదు. రెట్టింపు రేట్లతో వడ్డీలు తెచ్చి మరీ హామీల్ని అమలుచేస్తోంది. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా లెక్క చేయడం లేదు. ఇలా అమలు చేస్తున్న హామీలు ఇప్పుడు 98.44 శాతానికి చేరినట్లు పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామల్లో 98.44 శాతం అమలు చేసేసినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసిన పార్టీగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించిందని విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.

ఇదే ట్వీట్ లో విజయసాయిరెడ్డి మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. గతంకన్నా రెట్టింపు నగదుతో వచ్చేనెల 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా అమలు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. తద్వారా ఈ రెండు హామీలతో ఇక వందశాతం హామీల అమలు పూర్తయినట్లు సాయిరెడ్డి చెప్పేసినట్లయింది. మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగులు సీపీఎస్ రద్దు హామీ కోసం రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స 95 శాతం హామీలు అమలు చేశామని, అమలు కాని హామీల్లో సీపీఎస్ కూడా ఉందని చెప్పారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏకంగా 98.44 శాతం హామీలు అమలైనట్లు చెప్పడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications