కరకట్ట కొంపలో నిద్ర కరువైంది; చిట్టినాయుడికి చిప్ కరెప్ట్ అయ్యింది: విజయసాయిరెడ్డి సెటైర్లు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబును, లోకేష్ ను, తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి తనదైన శైలిలో తండ్రి కొడుకులకు సెటైర్లు వేశారు.

సీఎం చిత్రపటాలకు చేస్తున్న క్షీరాభిషేకాలు కరకట్టను ముంచెత్తుతున్నాయి
కొత్త జిల్లాల ఏర్పాటుతో వెల్లువెత్తిన 'థాంక్యూ సీఎం' నినాదాల హోరుతో కరకట్ట కొంపలో నిద్ర కరువైంది అంటూ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం చిత్రపటాలకు చేస్తున్న క్షీరాభిషేకాలు కరకట్టను ముంచెత్తుతున్నాయి అని పేర్కొన్నారు. అందుకే అధికారంలోకి వస్తే జిల్లాలకు న్యాయం చేస్తానంటున్నాడు చంద్రబాబు . మరి ఇన్నేళ్ళు నిద్ర పోయారా? అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేసి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చిట్టి నాయుడికి చిప్ కరెప్ట్ అయింది
లోకేష్ పై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి చిట్టి నాయుడికి చిప్ కరెప్ట్ అయింది. జేబు దొంగల భాష వాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. జేబు దొంగలు తాము కొట్టేసిన సొమ్ములో పంచాల్సిన వాటాలకు రకరకాల 'కోడ్' పేర్లు పెట్టుకుంటారట! ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి మంత్రిగా మూడేళ్ళే చేసినాదోచుకోవడంలో ఆరితేరిపోయి తండ్రిని మురిపించినా, జనాన్ని ముంచావు అంటూ లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మధ్యలో ఈ శిఖండి ప్రకటనలేంటి బాబులూ?
2014లో మోదీని పీఎం కానివ్వనంటూ ముంబైలో సోనియా శపథం చేశారని విజయ సాయి రెడ్డి గుర్తు చేశారు. మోదీ టీ అమ్ముకో అంటూ మరొకరు ఎగతాళి చేశారని పేర్కొన్నారు. 2024లో జగన్ గారిని సీఎం కానివ్వబోమంటూ రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఇలాంటి సవాళ్ళే చేస్తున్నారు అంటూ విజయసాయిరెడ్డి ఏపీలో ప్రతిపక్ష పార్టీల నుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు . ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేంది ప్రజలే. మధ్యలో ఈ శిఖండి ప్రకటనలేంటి బాబులూ? అంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేశారు.

ఆ గట్టునుంటావా 'నారన్న' ఈ గట్టునుంటావా?
అంతకుముందు ఆ గట్టునుంటావా 'నారన్న' ఈ గట్టునుంటావా? ఎవరెన్ని రకాలుగా పాడుకున్నా చంద్రబాబు నామోషీ పడరు అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అవసరమైతే మళ్ళీ బీజేపీకి మోకరిల్లుతారు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వాళ్లు నో అంటే కాంగ్రెస్ ఉండనే ఉంది. కొడవలి పార్టీ వాళ్లు చుట్టాలే. రాజనీతిపై నమ్మకం లేదు. ప్రతీది బిజినెస్ అంటాడు. ఎన్నికోట్లయినా ఫండింగు చేస్తారు అంటూ చంద్రబాబు ఏ పార్టీ మారడానికైనా సిద్ధంగా ఉంటారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుకి రాజనీతి పై నమ్మకం లేదని, డబ్బులు పెట్టి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఉద్దేశమని సాయి రెడ్డి మండిపడ్డారు.

ఏపీని శ్రీలంక చేయాలన్నది చంద్రబాబు కల
ఇక ఇటీవల ఏపీ త్వరలో శ్రీలంకగా మారబోతుంది అని, జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలపై స్పందించిన సాయి రెడ్డి ఏపీని శ్రీలంక చేయాలన్నది చంద్రబాబు కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు పగటికలలు కంటున్నాడు అని పేర్కొన్నారు. అక్షర దౌర్భాగ్యుడు చంద్రబాబు ఏది నోటికొస్తే అది మాట్లాడడం, ఎల్లో కుల మీడియా దాన్ని బ్యానర్గా వేయడం...2024 ఎన్నికల వరకు ఇది తప్పేలా లేదు. తర్వాత ఎలాగూ పార్టీ లేదు...బొక్కా లేదనడం ఖాయం అంటూ విజయ సాయి రెడ్డి తెలుగుదేశం పార్టీని, ఎల్లో మీడియా అంటూ చంద్రబాబుకు మద్దతుగా ఉన్న మీడియాను టార్గెట్ చేశారు.

చంద్రబాబును ప్రజలు చెత్తలో తొక్కినప్పటి నుంచి ఇదే పరిస్థితి
చంద్రబాబును ప్రజలు చెత్తలో తొక్కినప్పటి నుంచి ఎల్లో మీడియాను పీడ కలలు వదలడం లేదని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. శ్రీలంక మాదిరిగా రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటోందని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు. గత ఏడాది జాతీయ తలసరి ఆదాయం 1.50 లక్షలు. రాష్ట్ర తలసరి ఆదాయం 2.08 లక్షలు. అంతకు ముందు ఏడాది కంటే 31 వేలు పెరిగింది. కనిపించట్లేదా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఎవరెంత ఏడ్చినా ఐదున్నర కోట్ల మంది ప్రజలు స్వాగతించారు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ అత్యంత శాస్త్రీయంగా జరిగిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి 26 జిల్లాలు ఒక్కో ఆణిముత్యంలా అభివృద్ధిని నమోదు చేస్తాయని వెల్లడించారు. నాలుగు జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి, అన్నమయ్య, శ్రీసత్యసాయి పేర్లు పెట్టి వారిని చిరస్మరణీయులుచేశారు జగన్ గారు అని పేర్కొన్నారు. ఎవరెంత ఏడ్చినా ఐదున్నర కోట్ల మంది ప్రజలు స్వాగతించారు అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి.












Click it and Unblock the Notifications