తుప్పునాయుడు వల్లే ఇదంతా; చివరకు పప్పునాయుడు కూడా లెక్చర్లు ఇస్తున్నాడు.. ఖర్మ: సాయిరెడ్డి సెటైర్లు!!
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణ పై అలాగే విశాఖకు జగన్ తరలి వెళ్తే ఏం జరగబోతుంది అన్నదానిపై లోకేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ విశాఖకి వెళ్తే టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో సీట్లు పెరుగుతాయని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో విజయసాయి రెడ్డి భూ కబ్జాల కారణంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని అదే తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందని లోకేష్ పేర్కొన్నారు.

చివరకి పప్పు నాయుడు కూడా లెక్చర్లు ఇస్తున్నాడు: సాయిరెడ్డి
దీంతో అభివృద్ధి వికేంద్రీకరణ పై లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ విజయసాయిరెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ గురించి చివరికి పప్పు నాయుడు కూడా లెక్చర్లు ఇస్తున్నాడు.. ఖర్మ అంటూ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మీ నాయన తుప్పు నాయుడు చేసిన నిర్వాకంవల్లే కదా ఈ దుస్థితి పప్పూ అంటూ లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో భూ కబ్జాలతో కమీషన్లు కొట్టేశాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు.

వైజాగ్ లో ఆ ఎన్నికల ఫలితాలు చూడలేదా పప్పునాయుడు
ఇప్పుడు అక్కడ పప్పులు ఉడకడం లేదని గింజుకుంటున్నాడు అని చంద్రబాబును , లోకేష్ ను టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు ఓటేశామా అని బాధపడుతూ ఇప్పుడు జగన్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు విశాఖ వాసులు అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. వైజాగ్ కార్పొరేషన్ సహా ఉత్తరాంధ్ర మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూడలేదా పప్పు నాయుడూ? అర్థం పర్థంలేని నీ కామెడీ చూసి జనం నవ్వుకుంటున్నారు అని లోకేష్ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేష్ అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా బస్సుప్రమాదంపైనా సాయిరెడ్డి ట్వీట్
అంతేకాదు చిత్తూరు జిల్లా భాకరపేటలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 8 మంది మరణించడం తీవ్ర విషాదకరం అని పేర్కొన్న విజయ సాయి రెడ్డి మృతుల కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం అని వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

విశాఖ రైల్వే జోన్ వైసీపీ ఎంపీల కృషితోనే సాధ్యమైంది: విజయసాయి రెడ్డి
అంతకుముందు విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు చేసిన కృషి ఫలించిందని విజయ్ సాయి రెడ్డి వెల్లడించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి భూమిని కూడా గుర్తించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు రాజ్యసభలో స్పష్టం చేశారని తెలిపారు. ఇదిలా ఉంటే విశాఖ రైల్వే జోన్ వ్యవహారంలో కేంద్రం చిరకాల కోరిక తీరుతుందని, విశాఖ రైల్వే జోన్ బీజేపీతో సాధ్యమైందని సోము వీర్రాజు ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications