100 మహా శివరాత్రుల పుణ్యఫలం.. 220 ఏళ్ళలో 9 సార్లే!
లయకారకుడు ఆ పరమేశ్వరుడు.. పిలిస్తే పలికే భూతనాథుడు. శివయ్య అంటే చాలు పరవశించి వారాలు ప్రసాదించే లింగరూపుడు. ఎన్నో ఏళ్లుగా ఎందరో సిద్ధులు సైతం వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. ఒక్క అవకాశం శివ్యయ అనే భక్తుల కోసం 100 మహా శివరాత్రుల శక్తితో నందీశ్వరుడు ప్రసన్నమయ్యే దివ్యమైన రోజు అతి సమీపంలోనే ఉంది. శివనామ స్మరణతో సకల పాపాలు పటాపంచలు అయ్యే అద్భుత ఘడియలు ఆసన్నమయ్యాయి. ఖగోళ పరంగా, ఆధ్యాత్మిక పరంగా మానవాళి చరిత్రలో అత్యంత అరుదైన, పరమ పవిత్రమైన ఒక దివ్య యోగానికి 2026 జులై 13వ తేదీ సోమవారం వేదిక కాబోతోంది.
పురాణాల ప్రకారం వంద మాస శివరాత్రులు ఏకకాలంలో ఇచ్చే పుణ్యఫలాన్ని ప్రసాదించే "మహాశైవాక్షయోగం" ఈ జులై 13వ తేదీన సిద్ధించనుంది. దాదాపు 220 సంవత్సరాల కాలచక్రంలో కేవలం 9 సార్లు మాత్రమే సంభవించే ఈ అలౌక్య పుణ్య తిథి.. మళ్లీ దశాబ్దాల తర్వాత, అంటే 2053లోనే పునరావృతం కానుండటం దీని విశిష్టతకు అద్దం పడుతోంది.

శివ శక్తుల సమ్మేళనం.. సోమవారపు ఆరుద్ర!
ఈ పరమ పవిత్ర దినాన పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి, నక్షత్రాలు ఒకే చోట సమ్మేళనం కావడం విశేషం. జులై 13 సోమవారం నాడు ఆషాఢ కృష్ణపక్ష చతుర్దశి, మాస శివరాత్రి కలిసి రావడమే కాకుండా, శివుని జన్మ నక్షత్రమైన 'ఆరుద్ర' కూడగట్టుకుని రావడం శతాబ్దాల అదృష్టంగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ త్రివేణి సంగమం వంటి పరమ శివయోగం రోజున ఏ ఒక్కరు కూడా ఆలయాన్ని సందర్శించే అవకాశాన్ని వదులుకోవద్దని వేద పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు.
సకల దోష నివారణి.. మారేడు దళ అభిషేకం..
శాస్త్ర ప్రమాణాల ప్రకారం ఈ పర్వదినాన చేసే చిన్న సత్కర్మ అయినా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. నిత్య జీవితంలో ఎన్నో పూజలు చేసినా లభించని ఫలితం ఈ ఒక్కరోజు శివార్చనతో లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున పవిత్రమైన జలంలో బిల్వ పత్రం వేసి శివయ్యను అభిషేకం చేయడం వల్ల జాతకంలో తీవ్రమైన ఇబ్బందులు పెట్టే గురు దోషాలు తక్షణమే తొలగిపోతాయి. అంతేకాకుండా, వంశాన్ని పీడిస్తున్న పితృ శాపాలు, పితృ దోషాల నుంచి విముక్తి కలిగి, ఇంటిల్లిపాదికీ ఆ సదాశివుని సర్వరక్షణ లభిస్తుందని నమ్ముతారు.
సంతానం, వివాహ ప్రాప్తికి అద్భుత కాలం..
ఎంత ప్రయత్నించినా పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న వారికి, జాతకంలో గురుబలం లేక సతమతమవుతున్న యువతీ యువకులకు ఈ రోజున చేసే శివారాధనతో కాలం కలిసి వస్తుంది. అలాగే సుదీర్ఘ కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, రుణబాధలతో కుంగిపోతున్న వారికి ఈ తిథి విముక్తి మార్గాన్ని చూపుతుంది. సంతానం కోసం పరితపించే దంపతులకు ఈ శివ రాత్రి వ్రతం కల్పవల్లిగా మారుతుందని ప్రతీతి.
ఉపవాసం, పంచాక్షరి మంత్ర సాధన..
ఈ అద్భుత శైవయోగం రోజున భక్తులు ఉదయం నుంచి ఉపవాస దీక్షను ఆచరించి, "ఓం నమః శివాయ" అనే శివ పంచాక్షరి మహా మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఎన్ని పనులున్నా, ఎంతటి తీరిక లేకపోయినా ఈ జులై 13న దగ్గరలోని శివాలయానికి వెళ్లి ఆ భోళాశంకరుని దర్శించుకుని, తరిద్దాం.. త్రైలోకనాథుని అనుగ్రహాన్ని పొందుదాం.














Click it and Unblock the Notifications