చంద్రబాబులాగా ఎమ్మెల్యేలను కొని వారికి మంత్రుల కిరీటాలు పెట్టలేదు జగన్: సాయిరెడ్డి చురకలు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబును, టిడిపి నేతలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఏపీలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వైసీపీ నేతల నుంచి అసమ్మతి బయటపడిందని, వైసీపీ నేతలు తిరుగుబాటు చేసే రోజు దగ్గర పడిందని తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఆయన రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

ఏదో జరుగుతుందని కలలు కని ఇప్పుడు శోకాలు పెడితే ఎలా?
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై టీడీపీ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆకస్మిక నిర్ణయమేమీ కాదని వెల్లడించారు. చంద్రబాబులాగా ఎమ్మెల్యేలను కొని వారికి మంత్రుల కిరీటాలు పెట్టలేదు జగన్ గారు అంటూ పేర్కొన్నారు. 'ఏదో జరుగుతుందని' కలలు కని ఇప్పుడు శోకాలు పెడితే ఎలా? అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ముక్కలైన సైకిలును తుక్కు చేసేది ఎల్లో మీడియా భజన బృందాలే అని విజయసాయిరెడ్డి విమర్శించారు . పాతాళానికి గొయ్యి తవ్వి కోవాలని విజయ సాయి రెడ్డి టిడిపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

యనమలకు సాయిరెడ్డి సెటైర్లు
మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత లేదని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి సమాధానమిచ్చారు. పదవులు కొట్టేయడం, వియ్యంకుడిని టీటీడీ ఛైర్మన్ చేయడం తప్ప 40 ఏళ్లలో బీసీలకు ఏం చేశారు యనమలా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. మీ అల్లుడికి డిస్టిలరీ లైసెన్సు, పోలవరం కాంట్రాక్టులు కట్టబెడితే బీసీలు ఎదిగినట్టా? అని ఎనుముల రామకృష్ణుడు కి చురకలంటించారు. బీసీలను 'బ్యాక్ బోన్ క్లాసెస్' అని గౌరవించింది జగన్ గారు. అన్నిట్లో 50% ప్రాతినిధ్యం కల్పించారని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ ఆత్మీయతలతో నిండిన కుటుంబం.. విచ్చిన్నం కాదు
అంతేకాదు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో చంద్రబాబు, పచ్చ కుల మీడియా 4 రోజులుగా మంటలు లేపి, చిచ్చుపెట్టాలని చూశారు. అదిగో పొగ, ఇదిగో తిరుగుబాటు అని కాకమ్మ కథలు రాశారు అని విజయసాయిరెడ్డి చంద్రబాబుపై, చంద్రబాబు అనుకూలంగా పనిచేస్తున్న మీడియాపై విరుచుకుపడ్డారు. కడుపుమంటతో దొర్లి దొర్లి ఏడ్చారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఆత్మీయతలతో నిండిన కుటుంబం అని పేర్కొన్నారు. మీ 'దిష్టి'కి రాళ్లు పగలొచ్చేమో కానీ కుటుంబం విచ్ఛిన్నం కాదు అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం సమిష్టి కుటుంబం విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.

కరెంట్ సంక్షోభానికి చంద్రబాబే ఆద్యుడు అన్న సాయిరెడ్డి
ఇక ఇదే సమయంలో ఏపీలో కరెంటు సంక్షోభంపై విజయ సాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరెంటు సంక్షోభానికి చంద్రబాబేఆద్యుడు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కు అయ్యాడని విజయసాయి రెడ్డి ఆరోపించారు. 2014 నుంచి ఏటా 8.5% ఉత్పాదన పెరగాల్సి ఉండగా, ఏపీ జెన్కో ప్లాంట్లలో ఉత్పాదన తగ్గించి ప్రైవేటుకు దోచిపెట్టాడని విమర్శలు గుప్పించారు. అప్పట్లో హితేన్ భయ్యా కమిటీ సిఫారసులతో డిస్కంలను అమ్మాలని చూసిన చరిత్ర ఈ విజనరీది అంటూ చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ విజయ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications