లోకసభలో ఎంపీల 'గోవిందా.. గోవిందా': ఏపీపై కేంద్రమంత్రి ఇలా, వెంకయ్య పిలిస్తే టీడీపీ నో
Recommended Video

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో బేటీ అయ్యారు. దాదాపు ఇరవై నిమిషాలు వీరు భేటీ అయ్యారు. విభజన హామీలను సుజన ప్రధాని దృష్టికి తీసుకు వచ్చారు. బడ్జెట్లో ఏపీకి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవని చెప్పారు.
ఏపీకి హామీల విషయంలో టీడీపీ ఎంపీలు పార్లమెంటు లోపల, బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ నారదుడి వేషంలో నిరసన తెలిపారు. తల వెంట్రుకలకు పిలక వేసుకొని, రిబ్బన్ కట్టుకొని, మెడలో పూలమాల, చేతిలో చిడతలు, కాళ్లకు గజ్జెలు కట్టుకొని వచ్చి నిరసన తెలిపారు. టీడీపీ సభ్యులు గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతుంటే 'ఓం నమో నారా' అంటూ శివప్రసాద్ నిసన తెలిపారు.

కేంద్రమంత్రి అనంత్ కుమార్ స్పందన
ఏపీ విభజన హామీల అంశంపై కేంద్రమంత్రి అనంత్ కుమార్ లోకసభలో స్పందించారు. ఓ వైపు లోకసభ జరుగుతుండగా టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. వెల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. సేవ్ ఏపీ అంటూ నినాదాలు చేశారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసన మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.

సున్నితమైన అంశం, కేంద్రం పరిధిలో
ఈ సందర్భంగా కేంద్రమంత్రి అనంత్ కుమార్ మాట్లాడారు. ఏపీకి సంబంధించిన అంశం చాలా సున్నితమైనదని చెప్పారు. ఇప్పటికే ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పారు.

గోవిందా.. గోవిందా అంటూ నినాదాలు
ఓ వైపు అనంత్ కుమార్ మాట్లాడుతుండగానే టీడీపీ, వైసీపీ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. గోవిందా .... గోవిందా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోడీ నాడు ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారు గోవిందా గోవిందా అంటూ నినదించి మోడికి ఝలక్ ఇచ్చారు.

చర్చలకు టీడీపీ ఎంపీలు నో
టీడీపీ, వైసీపీ ఎంపీలనిరసన నేపథ్యంలో మిత్రపక్షమైన టీడీపీ ఎంపీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీలు చర్చలకు పిలిచారు. కానీ వారు చర్చలకు వెళ్లేందుకు నిరాకరించారు.












Click it and Unblock the Notifications