నా పూర్తి సహకారం జగన్కు ఉంటుంది: శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్
అమరావతి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన వ్యవసాయ రంగంలో రైతుల కోసం ప్రవేశ పెట్టిన రైతు భరోసా కార్యక్రమాన్ని అభినందించారు. రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో తనకు తెలుసన్న స్వామినాథన్... జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి కూడా రైతు పక్షపాతిగా పేరుగాంచారన్నారు. వైయస్ఆర్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
ఏపీ సీఎం జగన్ తను ప్రకటించిన నవరత్నాల్లో రైతు భరోసా కార్యక్రమాన్ని చేర్చడంపై స్వామినాథన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మంచి కార్యక్రమం ద్వారా రైతుల్లో భరోసా నింపగలిగారని ఆయన ప్రశంసించారు. రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో వారికి రైతు భరోసా కార్యక్రమం ధైర్యాన్ని ఇచ్చిందని స్వామినాథన్ కొనియాడారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డితో దగ్గరగా ఉండి పనిచేసే అవకాశం వచ్చినట్లు స్వామినాథన్ గుర్తుచేశారు. వ్యవసాయ రంగంలో తన పూర్తి సహాయ సహకారాలు సీఎం జగన్కు ఇస్తానని స్వామినాథన్ చెప్పారు.

రైతు పంటవేసే ముందు రైతన్నకు ఇచ్చే ఇన్పుట్ సబ్సీడీనే రైతు భరోసా కార్యక్రమం. అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.12500 ప్రభుత్వం ఇస్తుంది. ఇక ఈ రైతు భరోసా కార్యక్రమం ఈ ఏడాది అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కానుంది. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఏటా రూ .13,125 కోట్లు ప్రభుత్వం అందజేస్తుంది. ఇక ఏపీ ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు జగన్.
ఆసమయంలో రైతులు పడుతున్న కష్టాలను అతి దగ్గరగా చూసినట్లు ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకోరాదని వారి ఆత్మహత్యలకు ఆర్థిక పరిస్థితులే కారణమని భావించి వారికోసమే నవరత్నాల్లో రైతు భరోసా కార్యక్రమం తీసుకువచ్చినట్లు చెప్పారు. తన తండ్రి ఎలాగైతే రైతు పక్షపాతిగా ఉన్నారో తన పాలనలో కూడా అంతకంటే ఎక్కువగానే చేసి చూపిస్తానని సీఎంగా ప్రమాణస్వీకారం రోజున జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications