జైళ్లు సరిపోవు: చంద్రబాబుకు ముద్రగడ సవాల్, ‘హైదరాబాద్ వేదికగా చర్చలు’
హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. అంతేగాక, ప్రజా ఉద్యమకారులు, ఆందోళనకారులపై పీడీయాక్ట్ బనాయించి అణచివేయాలని సీఎం చంద్రబాబు.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడాన్ని ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఆక్షేపించారు.
హైదరాబాద్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ముద్రగడ సోమవారం మాట్లాడారు. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపులపై పిడి యాక్ట్ పెట్టాలని చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని తేల్చి చెప్పారు. జైళ్లకు, బెయిళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రిజర్వేషన్ల పోరాట భవిష్యత్ కార్యాచరణను చర్చించేందుకు హైదరాబాద్ వచ్చిన ముద్రగడ పద్మనాభం వివిధ వర్గాల మేధావులను, బిసి సంఘాల నేతలను కలిశారు. తమ పోరాటం మిగతా బిసి వర్గాలకు వ్యతిరేకంగా చేస్తున్నది కాదని, వారి రిజర్వేషన్ల కోటాను తీసుకోవాలన్నది తమ అభిమతం కాదని స్పష్టం చేశారు.
బిసి కమిషన్ చైర్మన్ మంజునాధ్కు ఇప్పటికే తమ సమస్యలను వివరిస్తూ మహాజర్లు ఇచ్చామని తెలిపారు. నవంబర్లో చేపట్టబోయే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ముద్రగడ అన్ని వర్గాల ప్రజలను, పార్టీల నేతలను కోరారు.
రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన రిజర్వేషన్ల పోరాట సమితి జేఏసీల సమావేశం తీర్మానాలను చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు మంగళవారం నాడు కాపు ప్రముఖుల సమావేశం జరగనుంది.
కాగా, ఈ సమావేశానికి ముద్రగడతో పాటు కాపు ప్రముఖులు, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు, ప్రముఖ నటుడు చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, వైయఎస్సార్ నాయకుడు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, తోట చంద్రశేఖర్, అద్దేపల్లి శ్రీధర్, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, కఠారి అప్పారావు, సిహెచ్ జనార్ధన్ తదితరులు హాజరవనున్నట్లు సమాచారం.