నాన్న దీక్ష విరమించరు, కిర్లంపూడిలోనే..: ముద్రగడ బాలు, ‘హెరిటేజ్పై దాడి’
తూర్పుగోదావరి: రిజర్వేషన్ల పోరాటం చేస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన కుమారుడు ముద్రగడ బాలు తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం దీక్ష విరమించాలని కోరిందని చెప్పారు.
'మీ డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది' అని, దీక్ష విరమించాలని పదే పదే కలెక్టర్, విశాఖ రేంజ్ డీఐజీ కోరినా తన తండ్రి అంగీకరించలేదని, జేఏసీ ఆందోళన చెందడంతో పరీక్షల కోసం బ్లడ్ శాంపుల్ ఇచ్చారని అన్నారు.
జేఏసీ కోరిక మేరకు సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నారని ఆయన చెప్పారు. అంతే కానీ, ఆయన దీక్ష విరమించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వచ్చిన ప్రతినిధులతో, తుని ఘటనలో అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేశాక మాట్లాడమని చెప్పారని ఆయన తెలిపారు. అలాగే తమను ఎలా తీసుకువచ్చారో, అలా గౌరవంగా తమను కిర్లంపూడిలో వదిలిపెడితే అక్కడ దీక్ష విరమణ చేస్తామని ఆయన చెప్పారని బాలు తెలిపారు.

ముద్రగడ దీక్ష ఎఫెక్ట్!: 'హెరిటేజ్' లారీపై కాపుల దాడి
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు సంబందించి బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ వైపు ప్రభుత్వం నెరపిన రాయబారం నేపథ్యంలో ముద్రగడ దీక్షను విరమించారని వార్తలు వినిపించాయి.
అప్పటిదాకా వైద్యానికి ససేమిరా అన్న ముద్రగడ... ఫ్లూయిడ్స్ ఎక్కించుకునేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఆయన దీక్ష విరమించినట్టేనని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అయితే తన తండ్రి దీక్ష విరమించలేదని ముద్రగడ కుమారుడు ప్రకటించారు.
ఇదే సమయంలో ముద్రగడ దీక్ష నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో రోజుల తరబడి కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు బుధవారం కూడా పలు ప్రాంతాల్లో జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెలలో ఆందోళనకు దిగిన కాపులు.. తమకు కనిపించిన హెరిటేజ్ ఫుడ్స్ లారీపై విరుచుకుపడ్డారు.
టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ కంపెనీ వాహనం కనిపించగానే ఆగ్రహావేశాలకు గురైన కాపులు దానిపై దాడికి దిగారు. ఈ దాడిలో హెరిటేజ్ లారీ అద్దాలు పగిలిపోయాయి. మరోవైపు జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ కాపులు నిరసనలు కొనసాగించారు.












Click it and Unblock the Notifications