బూతులు తిట్టారని.. ముద్రగడ కన్నీళ్లు!!, ధైర్యం చెప్పిన దాసరి
హైదరాబాద్ : మరోసారి కాపు ఉద్యమాన్ని ఉధృతం చేసే యోచనలో భాగంగా.. హైదరాబాద్ లో ఉన్న దాసరి, చిరు లాంటి నేతలతో ముద్రగడ మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. వచ్చే నెల 11వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహిచంబోయే కాపు ఐకాస సమావేశం ద్వారా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించాలనే దిశగా ముద్రగడ ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఆపై.. అదే నెల 16,17వ తేదీల్లో హైదరాబాద్ లో ఉన్న కాపు నేతలతో భేటీ అయి ఉద్యమ వ్యూహంపై చర్చించుకోవడం వంటి అంశాలను ఈ సమావేశంలో ముద్రగడ ప్రస్తావించారు. మొత్తం మీద తన హైదరాబాద్ పర్యటనతో.. మరోసారి ఉద్యమం చేయడం ఖాయమన్న సంకేతాలు పంపించిన ముద్రగడ.. దీక్ష సందర్బంలో చంద్రబాబు ప్రభుత్వం తన పట్ల వ్యవహరించిన తీరును దాసరితో చెప్పుకుని ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది.

ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నందుకు తనపై కక్ష గట్టిన ప్రభుత్వం.. తన కుటుంబం పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ముద్రగడ వాపోయినట్లుగా సమాచారం. ఇలా తన ఆవేదనను వ్యక్త పరుస్తున్న క్రమంలోనే.. ఓ దశలో ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని భేటీలో పాల్గొన్న నేతల నుంచి వెల్లడయినట్లుగా తెలుస్తోంది.
దీక్ష సందర్బంగా.. తన కొడుకుతో పాటు కోడలిని, ఇంట్లో ఆడవాళ్లను అరెస్టు చేసిన పోలీసులు.. బూతు మాటలతో వాళ్లను దూషించారని చెబుతూ ముద్రగడ భావోద్వేగానికి గురయ్యారట. పరువుగా బ్రతికిన కుటుంబాన్ని టీడీపీ ప్రభుత్వం రోడ్డుకీడుస్తోందని వాపోయారట. దీంతో దాసరి లాంటి నేతలు ముద్రగడకు ధైర్యం చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వచ్చే నెల 11న జరగబోయే సమావేశం తర్వాత.. ముద్రగడ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న అంశం.












Click it and Unblock the Notifications