జగన్ లింక్ తిప్పలు: కాణిపాకం గణపతి మీద ముద్రగడ ఒట్టు
కాకినాడ: తన వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉన్నారనే ముద్రను తొలగించుకోవడానికి కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రయత్నించినట్లు కనిపిస్తున్నారు కాణిపాకం సిద్ధివినాయకుని మీద ఒట్టు, తాను జగన్ను కలవలేదని, జగన్ తనను కలవలేదని ఆయన అన్నారు.
సోమవారంనాడు ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆ విధంగా అన్నారు. కాపు ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. తమ కాపు ఐక్యగర్జనకు జగన్తో సంబంధం ఉన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడడం తగదని అన్నారు.
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉన్న కాణిపాకం సిద్ది వినాయకుని ఆలయంలో ఇందుకు సంబంధించి ప్రమాణం చేస్తానని అంటూ జగన్తో కలిసినట్లు నిరూపించగలరా? అని ముద్రగడ ప్రశ్నించారు. తమ ఉద్యమంలో చెడు సంఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

ఉద్యమాన్ని మాత్రమే తాము నడుపుతున్నామని, అయితే తమపై బురదజల్లడం మానుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి తప్పుడు మార్గం అనుసరిస్తున్నారని, అబద్ధపు మాటలు చెప్పి గద్దెనెక్కారని, ఎన్నో జాతులను మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
చంద్రబాబు పంగనామాలు పెట్టడం మాని, చెప్పిన అబద్ధాలు నిజం చేయాలని డిమాండ్ చేశారు. గత రెండునెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఎమెర్జెన్సీ కన్నా పరిస్థితి దారుణంగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి అబద్ధాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అంటూ చంద్రాబబు విదేశీ ప్రయాణాలకు పెడుతున్న ప్రత్యేక విమానాల ఖర్చు.. కోట్లకుకోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు.
మేనిఫెస్టోలో లేని పట్టిసీమ ప్రాజెక్టును రూ.1600కోట్లతో నిర్మించారని, పండుగ కానుకలకు కోట్లు ఖర్చు చేస్తున్నారని, అమరావతి పేరు చెప్పి విమానాల్లో గాలిలోనే తిరుగుతూ కాపు జాతిని అలాగే గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. మీడియా ద్వారా తమపై దాడులు జరుగుతున్నాయని, అధికార పార్టీ ప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారని, ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఈ పనులు జరుగుతున్నాయని ముద్రగడ వివరించారు.
ముద్రగడకు సంఘీభావం మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంకు సోమవారం ప్రత్తిపాడు నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, కాపు నాయకులు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు జువ్వల చినబాబు, సానా నూకరాజునాయుడు, జల్లిగంపల ప్రభాకరరావు, యాళ్ల జగదీష్, సర్పంచ్ యాళ్ల విశ్వేశ్వరరావు, సూరాబత్తుల కొండలరావు, గౌతు స్వామి తదితరులు ముద్రగడను కలిసి సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications