జగన్ నిన్న గాక మొన్న పుట్టారు: చంద్రబాబుకు ముద్రగడ డెడ్లైన్
హైదరాబాద్: తమకు ఇచ్చిన హామీల అమలుకు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి డెడ్లైన్ పెట్టారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రంలోగా హామీలను నెరవేర్చకపోతే 11వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
తన వెనక జగన్ ఉన్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. జగన్ నిన్న గాక మొన్న పుట్టారని, తన రాజకీయ జీవితం జగన్తో ముడిపడి లేదని, చంద్రబాబు రాజకీయం తనకు తెలుసునని ఆయన అన్నారు. తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, జగన్తో తనకు సంబంధం ఉన్నట్లు రుజువు చేయాలని, అలా రుజువు చేస్తే తానూ తన కటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటామని ఆయన చెప్పారు.
తన జాతికి నష్టం జరిగినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. రుజువు చేయకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పిలిచినా తాను వెళ్లలేదని ఆయన చెప్పారు. నాలుగైదు సార్లు తనను ఆహ్వానించారని, ఎంపిగా ఉన్నప్పుడు సాయం చేస్తానని చెప్పారని, తాను తీసుకోలేదని ఆయన చెప్పారు.
వైయస్పై ప్రేమతో తాను జగన్ కోరిక మేరకు ఓదార్పు చేశానని, అంతకు మించి సంబంధం లేదని ఆయన అన్నారు. జగన్దతో తాను ఫోన్లో మాట్లాడడానికి ఇష్టపడలేదని, ఫోన్ చేస్తే ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పిన తర్వాతనే జగన్కు థ్యాంక్స్ చెప్తానని అన్నానని, అదొక్కటే ఫోన్ తాను జగన్తో మాట్లాడానని ఆయన చెప్పారు. తమ జాతకాలన్నీ చంద్రబాబు వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.
పిచ్చిపిచ్చిగా మాట్లాడవద్దని ఆయన హెచ్చరించారు. మోడీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటారని, తనపై ఎదురుదాడి చేయిస్తున్నారని ఆయన చంద్రబాబుపై విమర్శించారు. కాపు రుణమేళా పెట్టించి తమను తిట్టించారని, దరిద్రపు జాతి అని తిట్టించారని ఆయన అన్నారు. తమపై ఎదురు దాడి చేయించడం సరి కాదని ఆయన అన్నారు.
కాపులంతా టిడిపికి ఓటేశారని, తమకు ఇచ్చిన హామీల కారణంగానే టిడిపికి ఓట్లేశారని, తమ జాతికి వలవేసి ఓట్లు వేయించుకున్నారని, మాట నిలుపుకుంటారని ఓట్టేశారని, కానీ చంద్రబాబు హామీలు నీటి మీది రాతలయ్యాయయని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు బంగారు పల్లెంలో భోజనం చేయవచ్చునని చెప్పారని ఆయన అన్నారు. దరిద్రంలో ఉన్నాం కాబట్టే రిజర్వేషన్లు అడుగుతున్నామని ఆయన అన్నారు.
పచ్చచొక్కాలవారికే ఇస్తామని చంద్రబాబు అన్నారని, మిగతా వాళ్లు భారతీయులు కారా, మీకు పౌరసత్వం లేదని చెప్పండని, కావాలంటే తరిమేయండి గానీ పచ్చా చొక్కాలు ఉంటేనే అన్నీ ఇస్తామంటే సరి కాదని ఆయన అన్నారు. రామరాజ్యం అనిపించుకోవాలి గానీ రావణరాజ్యం అనిపించుకుంటే ఎంతో కాలం నిలువరని అన్నారు. కాపులకు వెంటనే మరోసారి 500 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ జాతిని అవహేళన, అపహాస్యం చేస్తున్నారని, దాన్ని సహించబోమని అన్నారు.
తన జాతి కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నానని, అందుకు స్వేచ్ఛగా వ్యవహరించడానికి తనకు అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. కులాలను ప్రోత్సహించింది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నామని, తప్పుదారి పట్టించే పనికి చంద్రబాబు పూనుకుంటున్నారని ఆయన అన్నారు. తన మనుషుల ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాపులకు ఇచ్చిన హామీలతోనే ఎన్నికల్లో టిడిపి గట్టెక్కిందని ఆయన చెప్పారు.మొదటి నుంచి చూస్తేనే సినిమా అర్థమవుతోందని, అధికారం కోసం పని చేయడం లేదని, జాతి కోసం మాత్రమే ఆందోళనకు దిగుతున్నానని ఆయన చెప్పారు. తనకు ఇచ్చిన హామీల అమలుకు రాతపూర్వక హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు.
ఉద్యమం పేరిట కాపు కులస్థులకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్యాయం చేస్తున్నారని ఆ కులానికి చెందిన రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణ స్వామినాయుడు, మీసాల గీత ఆరోపించారు. వారు గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిందలు వేసినందుకు ముద్రగడ తక్షణం క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందన్నారు.