ముద్రగడకు ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం: వైసిపి నేతల అరెస్టు
రాజమండ్రి: తుని ఘటనలో అరెస్టు చేసినవారిని వదిలేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రిలోనూ దీక్ష చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభానికి వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన దీక్ష శనివారంనాటికి మూడో రోజుకు చేరుకుంది.
భార్యతో కలిసి ఆయన ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించి వైద్యానికి సహకరించాలని అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బలవంతంగా ఆయనకు వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన దాన్ని ప్రతిఘటించారు.
తన డిమాండ్లను నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. ముద్రగడపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ముద్రగడను ముందస్తుగా ఆరెస్టు చేసినట్లు ఆయన శనివారం మీడియాతో చెప్పారు. ముద్రగడ దీక్ష కొనసాగుతోందని ఆయన చెప్పారు.

కాగా, ముద్రగడను పరామర్శించడానికి వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను తదితరులు హైదరాబాద్ నుంచి శనివారంనాడు రాజమండ్రి చేరుకున్నారు.
రాజమండ్రి విమానాశ్రయం వద్దనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వారు నిరసనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోరుకొండ పోలీసు స్టేషన్కు తరలించారు. కాగా, కాపు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా బంద్ను విఫలం చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాపు నేతలకు గృహనిర్బంధం విధిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కాపు నేతలను గృహ నిర్బంధం చేశారు. పాలకొల్లు నియోజకవర్గం కాపు అధ్యక్షుడు వంగా నర్సింహారావు, ఏలూరు పట్టణ కాపు నాయకుడుబోనం వెంకటనర్సయ్య, కాపు కార్యదర్శి జక్కంపూడి కుమార్ తదితరులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications