మునుగోడు లో గెలుపెవరది - ఏపీలో బెస్ట్ బెట్ రాజగోపాల్ : సీనియర్ల అంచనాలు ఇలా..!!
హోరా హోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రేపు (ఆదివారం) వెల్లడి కానున్నాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ జరగటంతో ఇప్పుడు ఫలితం పైన మరింత ఆసక్తి పెరిగింది. ఇక్కడ గెలుపు పైన సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కానీ, రాత్రి వరకు సాగిన పోలింగ్ తో ఒన సైడ్ ఫలితం రాదంటూ తాజా విశ్లేషణలు మొదలయ్యాయి. ఏకంగా 93.13 శాతం పోలింగ్ జరగటం తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డుగా నిలుస్తోంది. పోలింగ్ సరళిపైన ప్రధాన పార్టీలు విశ్లేషణలు చేసుకున్నాయి. పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోపల మాత్రం టెన్షన్ తోనే ఉన్నాయి.
ఈ సమయంలో మునుగోడు పైన బెట్టింగ్ లు అనూహ్య స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక పైన తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన రాజగోపాల్ గెలుస్తారంటూ పెద్ద స్థాయిలో బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. కడప జిల్లా నుంచి ఒక నేత టీఆర్ఎస్ 12 వేల ఓట్లతో గెలుస్తుందంటూ ఏకంగా 20 కోట్లు పందెంతో సవాల్ చేస్తున్నారు. పోలింగ్ ముందు వరకు ఏపీలో రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున పందేలు కనిపించినా..పోలింగ్ సరళి - ఎగ్జిట్ పోల్స్ క్రమేణా తగ్గుతూ వచ్చింది.
కానీ, దుబ్బాక తరహాలో మునుగోడులోనూ చివరి నిమిషం వరకు గట్టి పోటీ ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. పోలింగ్ సాయంత్రం 6 గంటలకు పూర్తయినా.. రాత్రి వరకు పోలింగ్ కొనసాగటంతో గెలుపు అంచనాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది. అయితే, సీనియర్ పొలిటీషియన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఉప ఎన్నికకు దిగే ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్ని ఏర్పాట్లు సిద్దం చేసుకున్నారని..నియోకవర్గంలో ఉన్న పట్లు సైలెంట్ ఓటింగ్ గా పోలైందని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని..అన్ని మార్గాల్లోనూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవటంలో క్షేత్ర స్థాయిలో సక్సెస్ అయిందని చెబుతున్నారు.
ఆ వ్యూమాలే గెలుపుకు దగ్గర చేస్తుందని చెబుతున్నారు. సర్వే ఫలితాలు కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కానీ, పోలింగ్ తీరు పైన రెండు ప్రధాన పార్టీల నేతలు ఒకరి పైన మరొకరు ఫిర్యాదులు చేసుకోవటంతో..ఓటరు నాడి పక్కగా తెలుసుకోవటంలో పోటీలో ఉన్న పార్టీల నేతలు సక్సెస్ కాలేదా అనే చర్చ కూడా మొదలైంది. తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే ఉప ఎన్నికగా భావిస్తున్న మునుగోడులో గెలిచేదెవరో ఆదివారం ఉదయం తేలిపోనుంది.