భూమి కొన్నా, నీలా దొంగలా.. రౌడీలా బతకాలా: జగన్పై మురళీ మోహన్
ఢిల్లీ: తన పైన వైసిపి నేతలు, సాక్షి పత్రిక చేసిన ఆరోపణల పైన తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ గురువారం నాడు స్పందించారు. వైసిపి అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. తాను సార్వత్రిక ఎన్నికలకు ముందే అక్కడ భూములు కొన్నానని చెప్పారు. అప్పుడు కూడా ఎలాంటి వివాదం లేని భూములు మాత్రమే కొన్నానని తెలిపారు. అమరావతి భూముల విషయంలో తన పైన అసత్య ప్రచారం సరికాదన్నారు.
తాను 1993 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నానని మురళీ మోహన్ చెప్పారు. తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి బినామీ కాదన్నారు. ఆయనతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పారు. చంద్రబాబుకు తనకు లావాదేవీలు అవాస్తవమన్నారు.

ఈ మురళీ మోహన్ తప్పు చేయడు
మురళీ మోహన్ తప్పు చేయడని, ఒకవేళ తప్పు చేస్తే తర్వాత ఉండడని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదుతో పాటు విజయవాడ, విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆలోచన చేశానని చెప్పారు. అసత్య ఆరోపణలతో వైసిపి తన పైన బురద జల్లుతోందన్నారు.
తాను సెంటు భూమి కూడా ఇప్పటి ప్రభుత్వం నుంచి తీసుకోలేదని చెప్పారు. తాను ఎన్నికలకు ముందే కొన్నానని చెప్పారు. ఓ చోట తాను భూమి కొన్నానని, తనకు కాగితాలు చేతికి వచ్చాయని, వాటిని అప్పుడే అమ్మేసినట్లు ఆరోపణలు చేశారన్నారు, అసలు తనకు కాగితాలే చేతికి రాలేదన్నారు.
నీలా రౌడీలా, దొంగలా బతకాలా
సమాజంలో నీతిగా, నిజాయితిగా ఉంటే బతకనివ్వరా అని జగన్ పైన మండిపడ్డారు. మీలా రౌడీల్లా, గూండాల్లా, దుర్మార్గుల్లా బతకాలా అని నిలదీశారు. మేం జగన్లా జైలుకు వెళ్లమని, వారానికి ఓసారి పోలీస్ స్టేషన్కు వెళ్లి రావడం తమ వల్ల కాదన్నారు. తాను నీతి, నిజాయితీగా ఉంటున్నానని చెప్పారు.
నన్ను కూడా మీలా దొంగలా, రౌడీలా ఉండమంటారా అని ప్రశ్నించారు. మంగళగిరిలో తాను కొన్నట్లుగా చెబుతున్నారని, అలాంటివి కనుక తనకు చూపిస్తే వాటిని చూపించిన వాళ్లకే ఇస్తానని చెప్పారు. తాను రైతుల నుంచి నిజాయితీగా కొన్నానని చెప్పారు. మార్కెట్ రేటు కంటే రైతులకు రూ.పది ఎక్కువ ఇచ్చానని చెప్పారు.
తనకు భూములు అమ్మిన రైతుల వద్దకు వెళ్లి మీరు అడగాలని, వారికి తాను ఏం చేశానో తెలుస్తుందన్నారు. నేను దేవుడి మీద, భూమి మీద, నా కన్నతల్లిదండ్రులు, బిడ్డల మీద ప్రమాణం చేసి నేను చెబుతున్నానని, తాను చట్టవిరుద్ధంగా భూములు తీసుకోలేదన్నారు. నేను ఏ తప్పు చేయలేదన్నారు.
గతంలో దివంగత నేతలు వైయస్ రాజశేఖర రెడ్డి, పిజెఆర్ (పి జనార్ధన్ రెడ్డి)లుకూడా తన పైన ఆరోపణలు చేశారని చెప్పారు. కానీ వాటిని నిరూపించలేకపోయారని తెలిపారు. వైసిపి ఇప్పుడు తన పైన అవాస్తవాలు ప్రచారం చేయడం తగదన్నారు.
ముద్రగడపై కాపు నేతల ఆగ్రహం
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పైన కాపు ప్రజాప్రతినిధులు కొందరు గురువారం మండిపడ్డారు. కాపు జాతికి ముద్రగడ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. ముద్రగడ పద్మనాభం ఉన్నాదస్థితిలో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి అన్నారు. కాపులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications