నమ్మకం ఉంది: వైసిపిపై మురళీ మోహన్ ఫైర్, సినీ పరిశ్రమ ఏ రాష్ట్రంలో అంటే...
అమరావతి: ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ మురళీ మోహన్ బుధవారం నాడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి ప్యాకేజీకి కేంద్రం చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పారు. నిన్న (మంగళవారం) దసరా పండుగ అయితే ఇవాళ అమరావతి పండుగ అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని, సినీ పరిశ్రమ ఏపీలో ఉండాలా? తెలంగాణలో ఉండాలా? అన్న ప్రశ్న అనవసరమని అభిప్రాయపడ్డారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు వేరుగా ధ్వజమెత్తారు.
మునిగిపోయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పైన జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలలో విశ్వసనీయత లేని అంబటి రాంబాబు లాంటి వ్యక్తులే లోకేష్ పైన అర్థరహిత విమర్శలు చేస్తున్నారన్నారు. టిడిపి, లోకేష్పై సాక్షిలో వేస్తున్న కథనాలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.