మటన్ మార్టులు, సినిమా టికెట్ల విక్రయాలు సరే .. ప్రైవేటీకరిస్తున్న ఆస్తులపై జగన్ మాట్లాడరా? నారాయణ సూటిప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైయస్సార్సిపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, పట్టించుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టడం మానేసి, జాతీయ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తుంటే వాటిని పట్టించుకోకుండా మటన్ మార్ట్ లు ఏర్పాటు చేయడం, సినిమా టికెట్లను ప్రభుత్వం విక్రయించడం వంటి నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడుతున్నారు.
జాతీయ ఆస్తులను ప్రైవేట్ పరం చెయ్యటంపై నోరు మెదపని జగన్ :సీపీఐ నారాయణ
ఇక తాజాగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మండిపడ్డారు. చిన్న చిన్న విషయాలపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్న ఏపీ ప్రభుత్వం, చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలను విస్మరిస్తోందని నిప్పులు చెరిగారు. మటన్ మార్టులు , సినిమా టికెట్ల విక్రయాలు చేపట్టాలనే ఆలోచన చేసిన రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల విలువ చేసే జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణపై ఎందుకు నోరు మెదపటం లేదని సీపీఐ నారాయణ మండిపడ్డారు.
మటన్ మార్టులు, సినిమా టికెట్ల విక్రయాల కంటే ముందు ప్రైవేటీకరణపై ప్రశ్నించండి
చిత్తూరు జిల్లాలో ఆయన స్వగృహంలో ఒక వీడియో విడుదల చేసిన నారాయణ జగన్ సర్కార్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మటన్ మార్టులు, సినిమా టికెట్ల విక్రయాల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న జాతీయ ఆస్తుల ప్రైవేటీకరణపై ప్రశ్నించాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి ఉందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించడం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నా రాష్ట్రప్రభుత్వం నిద్రపోతోందని నారాయణ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వీటిని చౌక ధరకు అమ్మేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నారాయణ ప్రశ్నించారు.
జాతీయ ఆస్తులను అంబానీ, అదానీలకు కట్టబెట్టటం కాకులను కొట్టి గద్దలకు వెయ్యటమే
ప్రజల పన్నులతో ఏర్పాటు చేసుకున్న జాతీయ ఆస్తులను అంబానీ, అదానీ లాంటి వారికి కట్టబెట్టడం చూస్తే కాకులను కొట్టి గద్దలకు వేసినట్టుగా ఉందని నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలంటే మటన్ మార్టులు, సినిమా టిక్కెట్లు విక్రయించటం వంటివి ముఖ్యం కాదని జాతీయ ఆస్తులను కాపాడటం ముఖ్యమని నారాయణ పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ ఆస్తులను విక్రయించాలని తీసుకుంటున్న నిర్ణయాలపై మాట్లాడాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు.
ఏపీలో కేంద్ర ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ .. స్టీల్ ప్లాంట్ తో మొదలై రేణిగుంట ఎయిర్ పోర్ట్ వరకు
ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది . ఇప్పటికే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎంతోమంది త్యాగాల ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని ఇప్పటికే కేంద్ర అడుగులు వేస్తోంది. విశాఖ పోర్టులో కూడా ప్రైవేట్ భాగ స్వామ్యాన్ని ఆహ్వానించింది. అంతేకాకుండా దేశంలోని అతి పురాతన రైల్వే స్టేషన్ లో ఒకటిగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ ను ప్రైవేటీకరించనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇక వీటితో పాటు రేణిగుంట విమానాశ్రయం కూడా అమ్మకానికి పెట్టింది .
Recommended Video
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రైవేటీకరణ నిర్ణయాలపై జగన్ మాట్లాడాలని నారాయణ డిమాండ్
నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ లో భాగంగా ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మొత్తం 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరించడాన్ని ఆమోదించింది. వాటిలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా అనేక ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ బాట పడుతున్న తీరుతో, కేంద్రాన్ని ప్రశ్నించని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సిపిఐ నారాయణ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాలపై జగన్ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.