నా కొడుక్కి 14 ఏళ్లు.. రేపటి తరం కోసమే నా పోరాటం: ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం
''సుదీర్ఘ అధ్యయనం తర్వాత ప్రారంభించినప్పటికీ జనసేన పార్టీ.. తన మొట్టమొదటి ఎన్నికల్లోనే దారుణంగా ఓడిపోయింది. వ్యక్తిగతంగా పోటీ చేసిన రెండు చోట్లా నేను పరాజయం పొందాను. అయినాసరే ఆ పరాజయం నా ప్రయాణాన్ని ఆపలేకపోయింది. ఎందుకంటే నాకు ఇగో లేదు. ఎక్కణ్నుంచి ప్రారంభమయ్యానో, నా టార్గెట్ ఏంటో స్పష్టంగా తెలుసు. నేను పనిచేస్తున్నది రేపటి మార్పుల కోసం. నా కొడుక్కి ఇప్పుడు 14 ఏళ్లు. నా పోరాటమంతా భవిష్యత్ తరాల గురించేతప్ప మరోటి కాదు. నిజంగా దేశంమీద ప్రేమ, పేదల కోసం పనిచేయాలనే తపన ఉన్నవాళ్లను ఓటములు అడ్డుకోలేవు'' అంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విద్యార్థుల్ని ఉత్సాహపర్చారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతోన్న 10వ ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ కార్యక్రమంలో గురువారం జనసేనాని కీలక ప్రసంగం చేశారు. ఓటములు ఎదురైనప్పటికీ లక్ష్యం కోసం జరిపే పోరాటాన్ని ఆపొద్దని.. కేవలం సోషల్ మీడియాకే పరిమితమైపోకుండా క్షేత్రస్థాయిలోకి వచ్చి పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. ప్రసంగానికి ముందు.. పవన్ జీవితవిశేషాలకు సంబంధించిన వీడియోను విద్యార్థుల కోసం నిర్వాహకులు ప్రదర్శించారు. తన జీవిత, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన విషయాలు పిల్లకు ఎంతో కొంత పనికొస్తాయనే ఈ కార్యక్రమానికి వచ్చానని పవన్ చెప్పారు. ఆయనేం మాట్లాడారంటే...

14ఏళ్లకే తపించిపోయాను..
‘‘నేను జనసేన పార్టీని స్థాపించింది దేశ సేవకోసమేగానీ వ్యక్తిగత గుర్తింపు కోసం కాదు. అధికారం నా అభిమతం కాదు.. మార్పు కోసమే నా పోరాటం. లక్షల మందిలో ఒకరిగా కూర్చొని ఉండటం ఇష్టం లేకే... దేశ సేవ కోసం పార్టీ పెట్టాను. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం వల్ల వ్యక్తిగతంగా కనీస అవసరాలకు ఇబ్బంది పడనప్పటికీ.. చుట్టూ ఉన్న సమాజంలో పేదల బాధలు చూసి చలించిపోయాను. 14 ఏళ్ల వయసులోనే ఒక ఐడియాలజీ కోసం నేను తపించిపోయాను. సమస్యల పరిష్కారానికి ఏం చెయ్యాలాని దీర్ఘంగా ఆలోచించేవాడిని. ఆ క్రమంలో జాతీయ నేతల జీవిత చరిత్రలతోపాటు ఎన్నో పుస్తకాలను లోతుగా చదివి అర్థం చేసుకున్నాను. సోషలిజం, క్యాపిటలిజం తదితర సిద్ధాంతాల్ని ఔపోసనపట్టాను.

ఇది చాలా కష్టమైన పని..
నిజానికి బాలలుగా ఉంటూ రాజకీయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. పంజాబ్ లో ఖలిస్థాన్ టెర్రరిజం, తమిళనాడులో ఎల్టీటీఈ ప్రభావం, జర్మనీ విభజన, సౌతాఫ్రికాలో వర్ణవివక్ష.. ఇలా వేటికవే విరుద్ధమైన విషయాలన్నీ నన్ను కలవరపర్చేవి. జాతీయ నాయకుల త్యాగాలు నన్ను అబ్బురపర్చేవి. ఏళ్లు గడుస్తున్నా సమాజంలో చెప్పుకోదగ్గ మార్పులేవీ రాకపోవడంతో నేను నిరాశకు లోనయ్యేవాడిని. నాయకుల అవినీతి, వారసత్వ రాజకీయాలు నాకు చిరాకు తెప్పించేవి.

ఏపీ బిభజన కలిచివేసింది..
కాలక్రమంలో నేను సినీ నటుడిగా మారినప్పటికీ.. మనసులో దేశం పట్ల ఆలోచనలు అలాగే కొనసాగేవి. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. సమాజాన్ని అధ్యయనం చేసే పనిని కూడా కొనసాగించాను. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. తమ స్వార్థం కోసం, వ్యక్తిగత అవసరాల కోసం రాజకీయ నేతలు ఎంతవరకు దిగజారగలరో చూశాక చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆ సమయంలోనే కచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చాను. సామాన్యులు, అణగారినవర్గాలు, అన్యాయానికి గురైనవాళ్ల తరఫున నిలబడాలని కంకణం కట్టుకున్నాను. అందుకే జనసేన పార్టీ స్థాపించాను. అంతకంటే ముందు..

తక్షణ పరిష్కారలు రావు..
2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించనప్పుడు... విద్యార్థులు, వృద్ధులు, మహిళలనే తేడాల్లేకుండా సమాజంలోని అన్ని వర్గాలతో ఇంటరాక్ట్ అయ్యాను. అప్పుడు నాకొక ముఖ్యమైన విషయం అర్థమైంది. నాతో మాట్లాడినవాళ్లలో ఎక్కువమంది.. సమస్యలకు తక్షణ పరిష్కారాలు ఉండాలని.. ఇన్స్టంట్ నూడుల్స్ తయారైనంత సేపట్లోనే న్యాయం దక్కాలని ఆశించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. యువత, పిల్లల్లో ఓపిక, సహనం లేకపోవడం బాధకలిగించింది. అప్పట్నుంచి నేనికా డీప్ గా అధ్యయనం చేశాను. ఎట్టకేలకు 2014లో జనసేన పార్టీ స్థాపించాను.

సీటు ఒక్కటే.. నమ్మేవాళ్లు లక్షలు..
ధైర్యంతోపాటు రాజకీయాల్లో కొనసాగడానికి కారణాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచింది ఒకే ఒక్క స్థానంలోనైనా.. ఇవాళ ప్రజలందరూ ఏ సమస్య వచ్చినా మా పార్టీ కార్యాలయానికే వస్తున్నారు. 2015 నాటి కర్నూలు బాలిక హత్య కేసు(సుగాలి ప్రీతి కేసు)లో జనసేన పోరాటం కారణంగానే సీబీఐ చేతికి వెళ్లడం గొప్ప విజయంగా భావిస్తాను. ఎన్నికల్లో ఇంకా ఎన్నిసార్లు ఓడిపోయినా.. ప్రజలు, దేశం కోసం నిలబడేఉంటాను. ఇవాళ్టి తరం సోషల్ మీడియాలో స్పందించి ఊరుకుంటే ఫలితం ఉండదు.. గ్రాస్ రూట్లోకి వెళ్లి పనిచేస్తేనే నిజమైన అనుభవం దొరుకుతుంది. వేల మాటలు చెప్పడం కంటే ఒక్క ఆచరణ మంచిదని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి''అని పవన్ కల్యాణ్ చెప్పారు. చివర్లో..

‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు
‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు.. తుఫాను గొంతు చిత్తం మరణం ఎరుగదు... పర్వతం ఎవరికీ సలాం చెయ్యదు.. నేను పిరికెడు మట్టే కావొచ్చుగానీ.. గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది''అన్న గుంటూరు శేషేంద్ర శర్మ కవితలను చదివి పవన్ ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications