ప్రభుత్వానికి ఆ అధికారం లేదు - సీఎస్ కు ఏబీ వేంకటేశ్వరరావు లేఖ : కేంద్ర అనుమతితోనే..!!
చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఏబీ వేంకటేశ్వర రావు సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాసారు. అందులో ఆయన తన పైన ఉన్న సస్పెన్షన్ కొనసాగించే అధికారం లేదంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. తన పై విధించిన సస్పెన్షన్ కు 2022 ఫిబ్రవరి 8 తో రెండేళ్లు నిండిన కారణం గా రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆటోమేటిక్ గా తొలగి పోయినట్లే అని తన లేఖలో వివరించారు. సర్వీసు రూల్స్ ప్రకారం తన సస్పెన్షన్ తొలిగిపోవటంతో..తనకు వెంటనే పూర్తి జీతం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.
తన పైన విధించిన సస్పెన్షన్ ను ఆరు నెలల చొప్పున పొడిగించారని..అది కూడా జనవరి 27తో ముగిసిందని చెప్పుకొచ్చారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్ కంటిన్యూ చేయాలంటే..కేంద్ర హోం శాఖ అనుమతి తప్పని సరిగా ఏబీ వేంకటేశ్వరరావు తన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకోకపోవటంతో..సస్పెన్షన్ ముగిసిందని లేఖ ద్వారా స్పష్టం చేసారు. 2021 జూలై 31న చివరి సారిగా తన సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఇచ్చిన జీవోను రహస్యంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. తనకు కాపీ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

అయినా.. తన సస్పెన్షన్ ఫిబ్రవరి 8తో ముగిసిందని స్పష్టం చేసారు. దీనికి సంబంధించి అన్ని వివరాలతో రాసిన లేఖను సీఎస్ శమీర్ శర్మకు ఏబీ వేంకటేశ్వర రావు పంపారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఈ లేఖ పైన ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. కొద్ది రోజుల క్రితం పెగాసస్ అంశం పైన రాష్ట్రంలో రాజకీయ వివాదంగా మారింది. దీని పైన అప్పట్లో నిఘా చీఫ్ గా పని చేసిన అధికారిగా ఏబీ వేంకటేశ్వర రావు క్లారిటీ ఇచ్చారు. తాను ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పెగాసస్ కొనుగోలు జరగలేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో తనపైన అభియోగాలు మోపిన కొందరు వైసీపీ నేతల పైన పరువు నష్టం దావా దాఖలు కోసం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి కోరినట్లుగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications