ఏంచేయలేకే: టిడిపిపై మైసూరా, బూత్లోనే పురంధేశ్వరి
హైదరాబాద్: సీమాంధ్రలో తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పవనాలు వీస్తున్నాయని, తెలుగుదేశం పార్టీ ఏం చేయలేకే తమతో వాగ్వాదానికి దిగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి బుధవారం హైదరాబాదులో అన్నారు. సీమాంధ్రలో అన్ని ప్రాంతాలలో తమ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఏకపక్షంగా ఓటు వేస్తున్నారన్నారు. దీనిని టిడిపి జీర్ణించుకోలేకపోతోందన్నారు.
ఎన్నికల్లో తమ పార్టీ 140 స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. 25 లోకసభ సీట్లు గెలిచి కేంద్రంలో తమ పార్టీ చక్రం తిప్పనుందన్నారు. టిడిపి నేతలకు జనస్పందన లేక భౌతిక దాడులకు దిగారని, సాక్షాత్తు ఈసీని కూడా బెదిరించి బ్లాక్ మెయిల్కు పాల్పడ్డారన్నారు.
ప్రశాంతంగా జరుగుతున్న పోలింగుకు పోలీసులే ఆటంకాలు సృష్టిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప లోకసభ అభ్యర్థి అవినాష్ రెడ్డి అన్నారు. అసలు పోలింగ్ అధికారి అనుమతి లేకుండా ఏఎస్పీ పోలింగ్ బూత్లోకి ఎలా ప్రవేశించారో చెప్పాలన్నారు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో తమ పార్టీ అభ్యర్థి తనయుడిని బూత్ నుండి లాగి కొట్టారన్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పొన్నూరు అభ్యర్థి రావి వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు.
రిగ్గింగ్ జరుగుతుందని బూత్లోనే పురంధేశ్వరి
రాజంపేట నియోజకవర్గంలోని పుంగనూరులోని సదుం పోలింగ్ కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రిగ్గింగుకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్రమాజీ మంత్రి పురంధేశ్వరి బూత్లోనే కూర్చున్నారు. జగన్ పార్టీ రిగ్గింగును తాను అడ్డుకున్నట్లు చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థి మిథున్ రెడ్డి కోసం ఆయన తండ్రి పెద్దిరెడ్డి రిగ్గింగుకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఆమె పోలింగ్ స్టేషన్లోనే కూర్చొని సరళిని పరిశీలించారు.