విమానాశ్రయం వద్ద రాళ్లదాడిపై స్పందించిన నాదెండ్ల మనోహర్
విశాఖపట్నం విమానాశ్రయం వద్ద వైసీపీకి చెందిన మంత్రుల వాహనాలపై దుండగులు జరిపిన రాళ్లదాడికి స్పందించి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. విశాఖగర్జన సభ తర్వాత పవన్ కల్యాణ్ పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆ పార్టీ నాటకాలాడుతోందని ధ్వజమెత్తారు. దాడిచేసింది జనసేనకు చెందినవారేనని పోలీసులు నిర్థారించలేదనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో గతంలో జరిగిన కోడికత్తి సంఘటనపై కూడా హడావిడి చేశారని, ఆ కేసు ఏమైందో ఇప్పటివరకు ఎవరూ తేల్చలేదన్నారు. కోడికత్తి పంథాలోనే ఇప్పుడు కూడా దాడి జరిగిందని హడావిడి చేస్తున్నారని, ఇద్దరు మంత్రులపై దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని, అసలు మంత్రులపై దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి సంస్కృతిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదని, పవన్ పర్యటనకు బందోబస్తు కల్పించాలని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డికి లేఖ రాస్తే నామమాత్రంగా బందోబస్తు కల్పించారని మనోహర్ విమర్శించారు.

విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ నేతల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు భారీగా విమానాశ్రయానికి తరలివచ్చారు. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రోజా, జోగి రమేశ్, మాజీ మంత్రి పేర్ని నాని, ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ ఘటనలో వైవీ సుబ్బారెడ్డి కారు అద్దాలు ధ్వంసమవగా మంత్రి రోజా భద్రతా సిబ్బందిలో ఒకరి తలకు గాయమైంది. వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో మూడురోజులపాటు పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications