పొత్తులపై జనసేన విధానం ఇదే - మా లక్ష్యం ఒక్కటే : నాదెండ్ల మనోహర్..!!
ఏపీలో రానున్న పొత్తుల పైన జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పరోక్షంగా తమ విధానం పైన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో తమ లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక..ఎన్నికలకు సంబంధించి పొత్తులతో సహా అన్ని అంశాల పైన పారదర్శకంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. అన్నింటినీ అధికారికంగా వెల్లడిస్తామని చెప్పారు. దీంతో, కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న పొత్తుల వ్యవహారం పైన స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం
జనసేన అధినేత పవన్ చెబుతూ వచ్చిన నినాదాన్నే మరోసారి ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ వినిపించారు. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని మనోహర్ స్పష్టం చేసారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ వైసీపీ విముక్త ఏపీ కసం అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారని గుర్తు చేసారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పిన విషయాన్ని మనోహర్ మరోసారి ప్రస్తావించారు.
ఆ మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నామన్నారు. పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక, ఎన్నికలకు ఎలా సిద్దం కాబోతున్నామో అందరికీ పారదర్శకంగా వెల్లడిస్తామని మనోహర్ స్పష్టం చేసారు.

వైసీపీ నిర్ణయం ప్రజాస్వామ్యబద్దం కాదు
యువత ఓట్లే లక్ష్యంగా జనసేన కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జనవరి 12న శ్రీకాకుళంలో యువశక్తి పేరిట కార్యక్రమం నిర్వహిస్తోంది. యువతకు ఉద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహర్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో మభ్యపెట్టిందని విమర్శించారు. వైసీపీ పార్టీ వ్యవహారాల కోసం అయిదు లక్షల మందితో ఇంటింటికి సారధులను నియమించుకోవటం పైన మనోహర్ స్పందించారు.
ఆ నిర్ణయం ప్రజాస్వామ్య బద్దం కాదని మనోహర్ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల క్రితం సీఎం జగన్ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.20 లక్షల మందితో బూత్ స్థాయిలో ప్రతీ 50 ఇళ్లకు ఇద్దరు సారధులను నియమించాలని నిర్ణయించారు. దీనిని జనసేన తప్పుబడుతోంది.

పొత్తుల విషయంలో ఇక తేల్చుడేనా
టీడీపీతో జనసేన పొత్తు అంశం పైన ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. తొలి నుంచి ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయనే అంచనాలు ఏపీ రాజకీయాల్లో కనిపించింది. అయితే, ప్రధానితో జనసేన అధినేత పవన్ భేటీ తరువాత పొత్తుల అంశం పైన డైలమా ఏర్పడింది.
టీడీపీతో పవన్ వెళ్లరని..బీజేపీతోనే ఉంటారని కమలం పార్ట నేతలు చెబుతున్నారు. కానీ, ఇటు జనసేన నేతలు మాత్రం ఎవరితో తాము కలిసి వెళ్లేది స్పష్టత ఇవ్వటం లేదు. అదే సమయంలో బీజేపీ - జనసేన కలిసి కార్యాచరణ నిర్ణయించ లేదు. వైసీపీ మాత్రం ఎన్నికల సమయానికి టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని చెబుతోంది. సీఎం జగన్ మొదలు పార్టీ నేతలంతా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఇక.. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దం అవుతున్న వేళ, జనసేన అధినేత జవనరి లో పొత్తులతో పాటుగా బస్సు యాత్ర..అదే విధంగా ఎన్నికల రూట్ మ్యాప్ పైన క్లారిటీ ఇస్తారని జనసేన నేతలు చెబుతున్నారు. ఇప్పుడు మనోహర్ వ్యాఖ్యలు మాత్రం.. పవన్ పొత్తుల అంశం లో గతం లో చెప్పిన విధానానికే కట్టుబడి ఉన్నారని.. మార్పు లేదనే విధంగా సంకేతాలు ఇస్తున్నాయి.












Click it and Unblock the Notifications