ధైర్యం లేకే పవన్ పై వ్యక్తిగత దాడి : ఎదుర్కోలేక సినిమా వాళ్లతో : సంయమనం పాటించాలి : నాదెండ్ల మనోహర్..!!
'రిపబ్లిక్ ' సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ ఏం మాట్లాడారో ఒకసారి చూడాలని వైకాపా నేతలకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హితవు పలికారు. సినీ పరిశ్రమకు కాపాడమంటే పవన్ను కాపాడాలని కాదన్నారు. సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారని మనోహర్ చెప్పారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయాలు, గతంలో చేసిన వాగ్దానాలపైనే మాట్లాడారని.. దానిపై ఎందుకు సమాధానం చెప్పరంటూ నిలదీశారు. తమ పాలనలో వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందకే పవన్ పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
పవన్ను ధైర్యంగా ఎదుర్కొలేకే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బలమైన ప్రతిపక్ష స్థానంలో జనసేన ఉందని చెప్పుకొచ్చారు. ఏనాడు పవన్ పదవుల కోసం పాకులాడిన వ్యక్తి కాదని చెప్పారు. భీమవరం కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే తాను ఓడిపోయిన పరవా లేదని...తాను ఒక్కడికే కాదు..జనసేన అధికారంలోకి వచ్చి అసెంబ్లీకి వెళ్దామంటూ నాడు పవన్ వ్యాఖ్యానించారని మనోహర్ గుర్తు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జనసేన అభ్యర్దులను నామినేషన్లు సైతం వేయనీకయండా మంత్రులు..ఎమ్మెల్యేలు పోలీసు సహాయం అడ్డుకున్నారని..వేధించారని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలోనూ పవన్ పార్టీ నేతలకు ధైర్యం కల్పించారని చెప్పారు. ఫలితాలు ఎలా ఉన్నా..ధైర్యంగా పోటీలో నిలబడాలని సూచించారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న మరణాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహిరంచకపోవటం కారణంగానే ఇవి జరిగాయని ఆరోపించారు. పవన్ ను ధైర్యంగా ఎదుర్కోలేక సినిమా వాళ్లను వాడుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పైన జనసేన పోరాటం చేస్తే అనూహ్య మద్దతు వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర చేయాలని సవాల్ చేసారు. పవన్ పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని... జగన్ ఎప్పుడూ కక్ష్య సాధింపు రాజకీయాలనే నమ్ముకున్నారని మనోహర్ ఆరోపించారు. జనసేన ఎదుగుదల చూసి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా జగన్ పైన దాడి చేయటం బాధకరమన్నారు. అయినా..జనసైనికులు సంయమనంతో ఉండాలని మనోహర్ సూచించారు. జనసైనికుల పైన అక్రమంగా కేసు నమోదు చేసి వేధిస్తున్నారని..అటువంటి వారికి అండగా నిలించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేసామని నాదెండ్ల చెప్పారు. సినిమా పరిశ్రమ కష్టాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను - వైఫల్యాల గురించి మాత్రమే పవన్ ప్రస్తావించారని మనోహర్ వివరించారు.