గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలే
గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న మార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్ గా ఉంది. దీనివల్ల ఎదురెదురుగా వచ్చే రైళ్లను, ఒకరైలు కన్నా మరో రైలును ముందుగా పంపిద్దామనుకుంటే సింగిల్ లైన్ కావడంతో ప్రయాణించే రైళ్లను కొన్ని రైల్వేస్టేషన్లలో నిలుపుదల చేయాల్సి వస్తోంది. దీనివల్ల రైలు నడిచే సమయం ఆలస్యమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నల్లపాడు-నడికుడి-బీబీనగర్ మార్గం అత్యంత కీలకమైంది. దీని పొడవు 239 కిలోమీటర్లు. ఎప్పటినుంచో దీన్ని డబుల్ లైన్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో స్పందించిన కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది.
కేంద్రం పచ్చజెండా
ప్రాజెక్ట్ నిర్మాణ వ్యవయం రూ.2854 కోట్లవుతుందనే అంచనా ఉంది. వీటిల్లో సివిల్ పనులకు రూ.1948 కోట్ల వ్యయం కానుంది. సిగ్నలింగ్, టెలికాం పనులకు రూ.320 కోట్లు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిర్మాణ పనులకు రూ.587 కోట్లు అంచనాగా పేర్కొన్నారు. ఈ పనులకు కేంద్ర కేబినెట్ వ్యవహారాల కమిటీ పచ్చజెండా ఊపించింది. ప్రస్తుతం ఈ మార్గంలో గూడ్స్ రైళ్ల ద్వారా మంచి ఆదాయం సమకూరుతోంది. బొగ్గు, సిమెంటు రవాణాతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా రవాణా అవుతున్నాయి. రామాపురం, జగ్గయ్యపేట, మేళ్లచెరువు, జాన్ పహాడ్, నడికుడి, విష్ణుపురం ప్రాంతాల్లో సిమెంటు పరిశ్రమలున్నాయి.

సిమెంటు, ఉక్కు, ఎఫ్సీఐ గోదాములు
నార్కెట్ పల్లి, చిట్యాలలో ఐరన్, ఉక్కు పరిశ్రమలు, విష్ణుపురంలో థర్మల్ పవర్ ప్లాంట్, నాగిరెడ్డిపల్లి, నల్గొండ, మిర్యాలగూడలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములున్నాయి. రెండోలైను నిర్మాణం జరిగితే వీటన్నింటికీ ఎంతో ప్రయోజనం చేకూరనుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ చేరుకోవడానికి ప్రస్తుతం రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
బీబీనగర్-నడికుడి-గుంటూరు మార్గం తక్కవ దూరం అవుతుంది. మరొక మార్గం ఖాజీపేట-ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకోవడం. సికింద్రాబాద్ నుంచి చెన్నై, తిరుపతి వెళ్లేందుకు వయా నడికుడి, గుంటూరు మార్గం దగ్గరిదారి అవుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రాక్ 148 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకుంటుంది. 150 నుంచి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకునేలా కొత్త రైల్వే లైనును నిర్మాణం చేసే అవకాశం ఉంది. డబుల్ లైను అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి సికింద్రాబాద్ చేరుకోవడానికి రెండున్నర గంటల నుంచి మూడు గంటల సమయం మాత్రమే పట్టే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications