MLA Roja : టీచర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే రోజా... విద్యార్థులకు ఆ పాఠం బోధించారు...
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులకు కొద్దిసేపు పాఠాలు బోధించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పథకంలో భాగంగా సర్వహంగులతో ఆధునికీకరించిన అత్తూరు జెడ్పీ హైస్కూల్ను ఆదివారం(ఆగస్టు 29) రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె టీచర్గా మారి విద్యార్థులకు సాంఘీక శాస్త్రంలోని 'భూమి-మనం' అనే పాఠాన్ని బోధించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
చిత్తూరు జిల్లాలోని అత్తూరు జెడ్పీ హైస్కూల్తో పాటు కేఆర్పాళెంలోని ప్రాథమిక పాఠశాల భవనాన్ని కూడా ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు.కొత్త భవనాల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.ఏపీలో విద్యార్థుల భవిష్యత్తు కోసమే సీఎం జగన్ ఆలోచిస్తుంటారని.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏపీ విద్యార్థులు ప్రపంచంలో ఏ పోటీ పరీక్షనైనా రాసేలా ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. పేద-మధ్య తరగతి విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేలా... ప్రైవేట్ స్కూళ్లలో ఉండే మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వ స్కూళ్లలోనూ కల్పించేలా ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. స్కూళ్ల రూపురేఖలతో పాటు విద్యా బోధనలో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం దృష్టి సారించింది.ఈ పథకంతో గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లు కొత్త రూపురేఖల్ని సంతరించుకున్నాయి.
అలాగే విద్యార్ధులకు యూనిఫారమ్ పంపిణీ, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం పథకం ఇలాంటి అన్నింటిలో వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. క్లాసుల్లో ఫర్నీచర్, టాయిలెట్లు కార్పొరేట్ హంగులతో ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణ ఆహ్లాదకరంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్దులకు మధ్యాహ్న భోజనంలో ఏడు రోజులు ఏడు రకాల వంటకాలతో పాటు ప్రతీరోజు ఓ స్వీటును అందించాలని నిర్ణయించారు.
నాడు- నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్వహణకు సంబంధించి నెల క్రితమే ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో గత పరిస్థితి, ఇప్పటి పరిస్థితుల ఫోటోలను ప్రదర్శించాలని సూచించారు. దీని కోసం పీవీసీ బ్యానర్లు వినియోగించవద్దని ప్రభుత్వం సూచించింది. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్లు, లైట్లు వంటి వాటిని తనిఖీ చేయటంతో పాటు మరమ్మత్తులు చేసే అంశంలో విద్యార్ధుల తల్లి తండ్రులతో కమిటీలు వేయాలని నిర్ణయించారు. మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిధులు ఉంచాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఎప్పటికప్పుడు సంబంధిత శానిటరీ ఉపకరణాలను కూడా ముందుగానే కొనుగోలు చేసుకోవాలని ఆదేశించింది. భవిష్యత్తులో నాడు-నేడు పథకాన్ని ఇంటర్, డిగ్రీ కాలేజీలు, వర్శిటీలు, పాలిటెక్నిక్, ఐటీఐలు, ఇతర వైద్యారోగ్య సంస్థలకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Recommended Video