టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తే క్రమశిక్షణ చర్యలు- నాగబాబు వార్నింగ్: జనసేనలో చీలిక?
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. టీడీపీకి అండగా నిలవాలని జనసేన నిర్ణయించుకుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటూ స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
ఆయన చేసిన ఈ ప్రకటన కాస్తా జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులకు కొరుకుడు పడట్లేదు. తాము పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంటే.. ఆయన చంద్రబాబును సీఎం స్థానంలో కూర్చోబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోన్నారనే అభిప్రాయాలు బహిరంగంగా వ్యక్తమౌతోన్నాయి.

కాపు సామాజిక వర్గం ఓటుబ్యాంక్ పెద్ద సంఖ్యలో ఉండే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలు పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోన్నారని, ఆయనతో విభేదిస్తోన్నారనే వార్తలు వస్తోన్నాయి. ఇది కాస్తా పార్టీ అగ్ర నాయకత్వాన్ని పునరాలోచనలో పడేసిందని, అందుకే పవన్ కల్యాణ్ కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటోన్నారనీ చెబుతున్నారు.
ఈ పరిణామాలన్నింటిపై తాజాగా నాగబాబు స్పందించారు. జనసైనికులు, వీర మహిళలు, ఎన్నారై విభాగం సభ్యులను ఉద్దేశించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో పలు కీలక అంశాలను పొందుపరిచారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి గల కారణాలను వివరించారు.
టీడీపీతో పొత్తు వ్యవహారంపై అన్ని ఆలోచించి, నిర్దుష్టమైన వ్యూహాత్మక విధానంతోనే పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని నాగబాబు చెప్పారు. కొన్ని నిర్ణయాలు..కొంతమంది నాయకులను స్వల్పకాలికంగా ఇబ్బందులకు గురి చేయవచ్చని, అంతిమంగా అవి రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు మేలు చేస్తాయని అన్నారు.
పార్టీ అగ్రనాయకత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా ప్రతి సభ్యుడు కూడా కట్టుబడి ఉండాల్సిందేనని నాగబాబు తేల్చి చెప్పారు. వ్యక్తుల కంటే పార్టీ గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించబోమంటూ ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. మిత్రపక్షం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సోషల్ మీడియా వేదికగా ఎలాంటి గొడవలు పడొద్దని, అవమానకరంగా ప్రవర్తించవద్దని కోరారు.
పార్టీ ప్రతిష్ఠ, సమగ్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన వారు ఎలాంటి వారైనా సరే క్రమశిక్షణ చర్యలను తీసుకుంటామని నాగబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో జనసేన పార్టీ జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని పేర్కొన్నారు. పార్టీని బలపరచడానికి అన్ని విభాగాలు సమష్టిగా పని చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications