చంద్రబాబు మనవడి కోసం ఈనెల 15న నారావారి పల్లెకు నందమూరి కుటుంబం
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశ్ తల వెంట్రుకలు తీయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారి పల్లెలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబంతో పాటు, అటు దేవాంశ్ తాతయ్య నందమూరి బాలకృష్ణ తరఫున నందమూరి కుటుంబాలు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఉగాది రోజున చంద్రబాబు తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలకు పండంటి మగబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే.

దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యుల సంఖ్య ఐదుకి చేరింది. నామకరణం రోజున ఆ చిన్నారికి ‘దేవాంశ్'గా పేరు పెట్టారు. బుధవారం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తన మనవడిని గుర్తు చేసుకున్న చంద్రబాబు, అతడితో కాసేపు గడుపుదామంటే సమయం చిక్కడం లేదని ఒకింత బాధ పడ్డారు.
తాను కుటుంబం కంటే పార్టీని ఎక్కువగా ప్రేమిస్తానని ఆయన చెప్పారు. ‘‘అధికారంలోకి వచ్చాక నా బాధ్యత మరింత పెరిగింది. భార్యతో మాట్లాడే సమయం కూడా ఉండటం లేదు. అయినా, ఆమె అర్థం చేసుకుని అన్నీ తానే చూసుకుంటుంది. నా మనవడిని చూడటానికి కూడా వెళ్లడం లేదు. అందరిలాగే నాకూ వాడితో కాసేపు గడపాలని ఉంటుంది. కానీ, సమయం ఉండదు. అయినా వీటన్నింటినీ మించి కార్యకర్తలే నాకు ప్రాణం. తొలి ప్రాధాన్యం వారికే'' అని ఆయన చెప్పుకొచ్చారు.
‘డబ్బు సంపాదనపై ఆశ లేనే లేదు... నా చేతికి ఉంగరం కాదు కదా గడియారం కూడా లేదు. అంతే కాదు ఖర్చులను ప్రభుత్వపరంగా నా పేషీ ఖర్చు చేస్తుంది. అంతకు మించి నాకు ఇతరత్రా ఖర్చులేమీ లేవు. ఇతరులపై ఆధారపడాల్సిన ఖర్మ లేదు. నా భార్య సంపాదిస్తోంది చాలు.. పైగా కుటుంబ ఆస్తి ఉంది. ఇంతకంటే ఏం కావాలి?' అన్నారు.












Click it and Unblock the Notifications