Balakrishna Biryani : బాలకృష్ణ స్పెషల్- 2 రూపాయలకే బిర్యానీ- ఎక్కడో తెలుసా ?
సినీ పరిశ్రమలో అయినా, రాజకీయాల్లో అయినా ఎప్పుడూ తన విలక్షణ శైలితో ఆకట్టుకునే హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో విన్నూత్న కార్యక్రమం చేపట్టారు. తన తండ్రి ఎన్టీఆర్ హయాంలో 2 రూపాయలకే కిలోబియ్యం ఇవ్వడాన్ని గుర్తు చేస్తూ మరో కొత్త కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బాలకృష్ణ విన్నూత్న కార్యక్రమం చేపట్టారు. తన నియోజకవర్గంలో ప్రతి రోజూ నిరుపేదలకు 2రూపాయలకే భోజనం అందించేందుకు బాలయ్య ఏర్పాటు చేసిన అన్న భోజనశాల ప్రారంభమై 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకుని బాలకృష్ణ 500 మంది పేదలకు బిర్యానీ పంచాలని నిర్ణయించారు. దీంతో అదే 2 రూపాయలకు చికెన్ బిరియాని, గుడ్డుు, స్వీట్ ను పంచారు. ప్రభుత్వ ఆసుపత్రి గేటు సమీపంలో టీడీపీ నేతలు దీన్ని నిర్వహించారు. దీంతో బిర్యానీ విందు ఆరగించేందుకు ప్రజలు బారులు తీరారు. తిన్నవారంతా జై జై బాలయ్య అంటూ జేజేలు కొట్టారు.
హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బాలకృష్ణ పూర్తిస్దాయిలో నియోజకవర్గానికి అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు ఉంటాయి. దీంతో ఈ మధ్య తరచుగా నియోజకవర్గానికి వస్తున్నారు. జనానికి అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తన తండ్రి ఎన్టీఆర్ శత జయంతి రావడం, అందులోనూ తాను ప్రారంభించిన అన్న భోజన శాల 200 రోజులు పూర్తి చేసుకోవడంతో జనానికి బిర్యానీ వడ్డించాలని నిర్ణయించారు. దీంతో గతంలో ఇస్తున్న విధంగానే ఇవాళ 2 రూపాయలే తీసుకుని బిర్యానీ వడ్డించారు. దీంతో బాలయ్య బిర్యానీపై జనం చర్చించుకుంటున్నారు.