నా వయసు గురించి మాట్లాడితే దబిడి దిబిడే - మంత్రికి బాలయ్య మాస్ వార్నింగ్..!?
తనకు 60 సంవత్సరాలు అంటే వాళ్లకు దబిడి దిబిడే నని పరోక్షంగా మంత్రి రోజాను ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.
నందమూరి బాలకృష్ణ పరోక్షంగా మంత్రి రోజాపైన ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ తో బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బాలయ్య వ్యాఖ్యలతో అక్కినేని అభిమానులు ఆందోళనలకు దిగారు. దీని పైన స్పందించిన మంత్రి రోజా ఈ వ్యవహారం పైన నాగార్జున స్పందించాలని డిమాండ్ చేసారు. అదే సమయంలో బాలయ్య రెండు సార్లు ఎమ్మెల్యే అయినా.. వయసు పెరిగినా మనిషి మాత్రం మారలేదని వ్యాఖ్యానించారు. దీని పైన స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ పరోక్షంగా రోజాను ఉద్దేశించి ఎవరైనా నాకు 60 సంవత్సరాలు అంటే వాళ్లకు దబిడి దిబిడే నని హెచ్చరించారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో పర్యటించారు. అక్కడ సరస్వతీ విద్యా మందిర్ లో కంప్యూటర్లను పంపిణీ చేసారు. రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు పోతున్నారని ఫైర్ అయ్యారు. కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ రావట్లేదని ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.
పరిశ్రమలు రావడం లేదని..రాష్ట్రంలోఉన్న పరిశ్రమలు వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బాలయ్య హెచ్చరించారు. ప్రజలు కూడా తిరగబడాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని బాలయ్య ధీమా వ్యక్తం చేసారు.
తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు పరిశ్రమలు తీసుకొస్తామని వెల్లడించారు. సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. కానీ, అభివృద్ధి చేయాలంటే మాత్రం అధికారం ఉండాలని బాలయ్య విశ్లేషించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి శూన్యంమని..చెప్పుకోవటానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. నాడు తన తండ్రి ఎన్టీఆర్ తనను చదువుకుంటేనే సినిమాల్లోకి రావాలన్నారని బాలయ్య గుర్తు చేసారు. తాను ఒకవేళ సినిమాల్లో రాణించ లేకపోతే చదువుకున్నా కాబట్టి ఉద్యోగమైనా చేసుకోగలనని ఆయన నమ్మకమని వివరించారు.
అక్కినేని ..తొక్కనేని మాటలపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పుకొచ్చారు. నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నానని వివరించారు. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు.
నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా తనను ప్రేమించే వారని చెప్పుకొచ్చారు. తన తండ్రి పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగిందని గుర్తు చేసారు. బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుందన్నారు. బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని బాలయ్య స్పష్టం చేసారు.