లేపాక్షి ఉత్సవాలు: శ్రీకృష్ణదేవరాయల పాత్రలో బాలయ్య (వీడియో)
అమరావతి: తన నియోజకవర్గమైన హిందూపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలకు అందరూ తరలిరావాలని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆహ్వానించారు.
ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు.
వెంకయ్యతో బాలకృష్ణ భేటీ: ఉత్సవాలకు ఆహ్వానం, నియోజకవర్గ సమస్యలపై చర్చ
ఉత్సవాలకు వచ్చిన వారిని ఆటపాటలతో అలరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా లేపాక్షి ఉత్సవాల విశిష్టతను తెలియజేస్తూ అందరికీ ఇదే మా ఆహ్వానం అంటూ ఓ వీడియోని రూపొందించారు. అందులో ఈ నెల 27, 28 తేదీల్లో లేపాక్షిలో జరిగే పండుగకు మీరంతా రావాలన్నారు.
లేపాక్షి ఉత్సవాలను విజయవంతం చేయాలని బాలకృష్ణ కోరారు. ఈ ఉత్సవాల్లో బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో అభిమానులకు కనువిందు చేయనున్నారు. లేపాక్షి ఉత్సవాలకు రావాల్సిందిగా ఇప్పటికే అటు కేంద్ర మంత్రలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని పలువురు మంత్రులను బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించారు.
ఏపీలో ఉత్సవాలకు రావాలంటూ తెలంగాణ మంత్రికి బాలకృష్ణ ఆహ్వానం
లేపాక్షి ఉత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు పాల్గొంటారని బాలకృష్ణ వెల్లడించారు. లేపాక్షి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేస్తోంది. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం రూ. 4 కోట్లు కేటాయించింది.