తెలుగు భాషాదినోత్సవం రోజునే భాషాభిమాని కన్నుమూత: నాడు రాజ్యసభలో తెలుగు కోసం పోరాడి..
Recommended Video

హైదరాబాద్: మాజీ సీఎం, దివంగత నేత ఎన్టీఆర్ తనయుడిగా సినీరంగం, రాజకీయాల్లోకి వచ్చినా.. హరికృష్ణ తనకంటూ ఓ ప్రత్యకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రిలాగే హరికృష్ణ కూడా తెలుగు భాషాభిమాని. బుధవారం ఉదయం ఆయన నార్కట్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

తెలుగు భాషా దినోత్సవం రోజునే..
అయితే, తెలుగు భాషాదినోత్సవం రోజు((ఆగస్టు 29))నే ఆయన మృతి చెందడంపై భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంలో రాజ్యసభలో తెలుగులో మాట్లాడి హరికృష్ణ తన భాషాభిమానాన్ని చాటుకున్నారు. తెలుగువారిని అమితంగా ఇష్టపడే హరికృష్ణ, తెలుగు రాష్ట్రం కోసమే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడి..
నాడు రాజ్యసభలో తెలంగాణపై చర్చ సందర్భంగా.. తెలుగు ప్రజలను విడదీసే చర్చలో పాల్గొనడం బాధాకరమని హరికృష్ణ తెలుగులోనే మాట్లాడటం మొదలుపెట్టారు. అందుకు రాజ్యసభ ఉపసభాపతి కురియన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా అనుమతి లేనందున తెలుగులో మాట్లాడటం కుదరదని చెప్పారు. ముందుగా అనుమతి కోరితే ట్రాన్స్లేటర్ను ఏర్పాటు చేసేవారమని తెలిపారు.

ట్రాన్స్ లేషన్ కాదు.. ఎక్స్ప్రెషన్ ముఖ్యం
అయితే, ట్రాన్స్లేషన్ కాదు ఎక్స్ప్రెషన్ ముఖ్యమని హరికృష్ణ బదులిచ్చారు. తెలుగువాడిని కావడం వల్ల తెలుగులోనే మాట్లాడతానని పట్టుబట్టారు. తెలుగులో మాట్లాడటం తప్పుకాదు, ముందుగా చెప్పకపోవడం నిబంధనలకు విరుద్ధమని కురియన్ అభ్యంతరం చెప్పారు. మీరు ఏం మాట్లాడుతున్నారో తనకైనా అర్థం కావాలి కదా అని అన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో నాటి బీజేపీ ఎంపీ వెంకయ్యనాయుడు కలగజేసుకొని పలానా భాషలో మాట్లాడాలనే అధికారం అధ్యక్షునికి లేదని అన్నారు.

తన్నుకుచావమంటారా?
కాగా, తెలుగులో మాట్లాడవద్దని ఉపసభాపతి ఎంత అభ్యర్థించినా.. హరికృష్ణ మాత్రం తెలుగులోనే మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించి తాంబాళాలు ఇచ్చాం.. తన్నుకు చావండి అంటారా? అని హరికృష్ణ ప్రశ్నించారు. కాగా, హరికృష్ణ మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications