మానవత్వం మరువలేదు: నందమూరి అభిమానులకు హరికృష్ణ రాసిన చివరి లేఖ ఇదే
Recommended Video

హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కుమారుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన మరణంతో ఎన్టీఆర్ కుటుంబంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది.
హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వెళ్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారు.

అభిమానులకు సందేశం ఇస్తూ లేఖ
కాగా, సెప్టెంబర్ 2న హరికృష్ణ పుట్టిన రోజు. మరో నాలుగు రోజుల్లో ఆయన పుట్టినరోజు జరగనున్న నేపథ్యంలో హరికృష్ణ అభిమానులను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. పుట్టినరోజున అభిమానులకు సందేశం ఇవ్వాలని ముందుగా రాసి పెట్టుకున్న ఈ లేఖ ఆయన మరణించిన తర్వాత బయటికి వచ్చింది.

మానత్వం మరవని హరికృష్ణ.. లేఖలో ఇలా..
‘సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.. ఇట్లు- మీ నందమూరి హరికృష్ణ' అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

కంటతడిపెట్టిన అభిమానులు
హరికృష్ణ రాసిన ఈ లేఖే చివరిది కావడంతో అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎంతో మానవత్వం కలిగిన వ్యక్తి కన్నుమూశారని, నాలుగు రోజుల్లో జన్మదినం చేసుకోవల్సిన తమ అభిమాన నేత, నటుడు, నిర్జీవంగా కనిపించడంతో వారు తట్టుకోలేకపోతున్నారు.

కామినేనికి చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
మరోవైపు హరికృష్ణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర కుటుంబసభ్యులు నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications