నంద్యాల ఉపఎన్నిక: వైసీపీకి ఓటమి భయం.. ఆపేందుకు కుట్ర.. జాగ్రత్త, నేతలకు బాబు సూచన
నంద్యాల ఉపఎన్నికను ఏదో ఒక విధంగా ఆపాలని వైసీపీ కుట్ర పన్నుతోందంటూ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం అమరావతిలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో అభిప్రాయపడ్డారు.
అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక విషయంలో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, దీంతో ఉపఎన్నికను ఏదో ఒక విధంగా ఆపాలని ఆ పార్టీ కుట్ర పన్నుతోందని తెలుగుదేశం పార్టీ సందేహం వ్యక్తం చేసింది.
గురువారం అమరావతిలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో పలువురు ఈ మేరకు అభిప్రాయపడ్డారు.
ఓటమి భయంతో ఎన్నికనే ఆపాలని...
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... నిన్న జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నంద్యాల ఉప ఎన్నిక అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా.. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ వెనకబడిపోయిందని, టీడీపీ గెలుపు ఖాయమని తేలిందని, దీంతో ఎలాగోలా ఈ ఎన్నిక ఆపాలని వైసీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం వస్తోందని, శాంతి భద్రతల సమస్యను లేవనెత్తడం లేదా మరో సమస్య సృష్టించడం ద్వారా పోలింగ్ను వాయిదా వేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోందని టీడీపీకి చెందిన ఒకరిద్దరు నేతలు పేర్కొన్నారు.
జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు...
ఎన్నికల కమిషన్లో ఉన్న తన శ్రేయోభిలాషులు ఈ విషయంలో సహకరిస్తారని జగన్ ఆలోచన అని, ఇలాంటి ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించాలని సమన్వయ కమిటీ సమావేశంలో పలువురు టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ... వైసీపీలో నిస్పృహ అలుముకోవడంతో ఎటువంటి ప్రయత్నాలకైనా ఒడిగట్టవచ్చని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండటం అవసరమని అభిప్రాయపడినట్లు తెలిసింది.
విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు...
నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ప్రచారం చురుగ్గా సాగుతోందని... అయితే, చివరి నిమిషం వరకూ అప్రమత్తంగా ఉండాలని పర్యవేక్షణ బాధ్యతలను తీసుకొన్న నేతలకు ఈ భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడానికి సకల ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటిని తగిన విధంగా ఎదుర్కోవాలని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యాలయం గుంటూరులో ఉండటం కొంత అసౌకర్యంగా ఉందన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది.
మంత్రులకు కొత్త బాధ్యతలు...
పార్టీ కొత్త కార్యాలయం నిర్మాణానికి మంగళగిరిలో ఇప్పటికే స్థలం కేటాయింపు జరిగినందువల్ల అక్కడ తక్షణం భవన నిర్మాణం ప్రారంభించాలని కూడా సమన్వయ కమిటీ సమావేశంలో నిశ్చయించారు. సరిగ్గా ఏడాదిలో భవనం నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని మంత్రి లోకేశ్ను చంద్రబాబు ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానానికి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలోకి కొత్తగా సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, అచ్చెన్నాయుడును తీసుకోవాలని నిర్ణయించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పంపాలని నిర్ణయం తీసుకొన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచార సమన్వయ బాధ్యతను మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడులకు అప్పగించారు.
నంద్యాల ప్రజలు విజ్ఞులు: అచ్చెన్నాయుడు
నంద్యాలలో వైసీపీ ఓటమి ఖాయం కావడంతో ఎలాగైనా ఎన్నికలు వాయిదా వేయించాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయంలో ఎన్నికల కమిషన్తోపాటు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబును కాల్చాలని, ఉరి తీయాలని, కాలర్ పట్టుకుని నిలదీయాలని జగన్ రెచ్చగొట్టారు. నంద్యాల ప్రజలు విజ్ఞులు కావడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నికలు అయిన తర్వాత వైసీపీ జెండా పీకే పరిస్థితి వస్తోందనుకున్నాం. కానీ... అంతకుముందే వైసీపీ జెండా పీకేస్తోంది..'' అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటర్లు టీడీపీ చేసిన అభివృద్ధివైపు మొగ్గు చూపుతున్నారని... దిక్కుతోచని స్థితిలో జగన్ ఎక్కడికక్కడ గొడవలు సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని అంతర్గతంగా జరిగిన వైసీపీ సమావేశంలో పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలిసిందన్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.