నంద్యాలలో మరోమారు వేడెక్కిన రాజకీయం: మొదలైన అసంతృప్తులు, బుజ్జగింపుల పర్వం
నంద్యాల రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఉపఎన్నిక సందర్భంగా టిక్కెట్ విషయంలో భంగపాటుకు గురైన శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికే వైసీపీ గూటికి చేరగా, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కూడా టీడీపీని వీడే యో
కర్నూలు: నంద్యాల రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. ఉపఎన్నిక సందర్భంగా టిక్కెట్ విషయంలో భంగపాటుకు గురైన శిల్పా మోహన్ రెడ్డి ఇప్పటికే వైసీపీ గూటికి చేరగా, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కూడా టీడీపీ అధిష్ఠానంపై మండిపడుతున్నారు.
పార్టీలో, పార్టీ కార్యక్రమాల్లో తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తిలో ఉన్న ఆయన పార్టీని వీడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చక్రపాణి రెడ్డి కూడా సోదరుడి మాదిరిగానే వైసీపీ గూటికి చేరవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
మరోవైపు ఈ విషయమై ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి స్పందించారు. వైసీపీ అధినేత జగన్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. కానీ... వైసీపీ ముఖ్య నేతల నుంచి తనకు ఆహ్వానం అందినమాట వాస్తవమేనని స్పష్టం చేశారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికే.. టీడీపీ హైకమాండ్ అధిక ప్రాధాన్యమిస్తోందని, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. త్వరలో కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం ప్రకటిస్తానని చక్రపాణిరెడ్డి తెలిపారు.
వైసీపీలో చేరడం ఖాయమేనా?
ఆగష్టు 3వ తేదీన శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్లు కర్నూలు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు టీడీపీ నేతలు చక్రపాణిరెడ్డిని ఆహ్వానించకపోవడంతో అలకబూనిన ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Recommended Video
పనిచేస్తున్న ‘శిల్పా’ ఒత్తిడి?
చక్రపాణి రెడ్డి పార్టీ మారే విషయంలో ఆయన సోదరుడు, వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలోకి రావాలని చక్రపాణిరెడ్డిని తాను ఆహ్వానించానని, తమ మధ్య విభేదాలు తొలగినట్లేనని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. ఇద్దరం ఒకే పార్టీలో ఉంటేనే బాగుంటుందని చక్రపాణిరెడ్డికి తాను సూచించానని, దీనిపై చక్రపాణిరెడ్డి తన నిర్ణయాన్ని త్వరలోనే చెబుతానన్నారని మోహన్ రెడ్డి పేర్కొనడం గమనార్హం.
మోహన్ రెడ్డి రాకతో...
సోమవారం నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా శిల్పా మోహన్రెడ్డి.. చక్రపాణిరెడ్డిని కలిశారు. వీరిద్దరూ స్వయాన సోదరులు. ఈ భేటీ అనంతరం చక్రపాణిరెడ్డి టీడీపీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ ఆగస్టు 3వ తేదిన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో చక్రపాణిరెడ్డి ఆ పార్టీలో చేరబోతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి.
ప్రాధాన్యత దక్కడంలేదు.. అందుకే..
పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడమే చక్రపాణిరెడ్డి పార్టీ మార్పునకు కారణమని తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు టీడీపీ నేతలు చక్రపాణిరెడ్డిని ఆహ్వానించకపోవడంతో ఆయన అలకబూనడం చివరికి ఈ పరిణామాలకు దారితీసింది. ఇటీవల నంద్యాలలో చంద్రబాబు పర్యటించిన సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా తన ఫొటో కనబడకపోవడం కూడా చక్రపాణిరెడ్డి మనస్థాపానికి కారణంగా తెలుస్తోంది.
రంగంలోకి టీడీపీ అధిష్ఠానం...
ఎమ్మెల్సీ శిల్సా చక్రపాణిరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాల నేపథ్యం టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. శిల్పాను బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతల ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే చక్రపాణిరెడ్డిని మంత్రి కాల్వ శ్రీనివాసులు, సీఎం రమేష్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు కలిశారు. వీరు చక్రపాణిరెడ్డిని బుజ్జగిస్తున్నట్లు సమాచారం.
సీఎం దృష్టికి తీసుకెళ్తాం...
శ్రీశైలం నియోజకవర్గంలోని సమస్యలపై శిల్పా చక్రపాణిరెడ్డితో చర్చించామని, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. శిల్పా చక్రపాణిరెడ్డికి మండలి చైర్మన్ పదవి ఇచ్చే విషయంలో సీఎం చంద్రబాబుదే తుది నిర్ణయమని సీఎం రమేష్ స్పష్టం చేశారు.
ఇప్పుడేం చెప్పలేను: చక్రపాణిరెడ్డి
మరోవైపు తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై చక్రపాణిరెడ్డి కూడా స్పందించారు. ఆగస్టు 3న వైసీపీలో చేరుతున్నట్లు ఇప్పుడే చెప్పలేనని, కార్యకర్తలతో సమావేశమయ్యాకే తన తుది నిర్ణయం వెల్లడిస్తానని చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు.