నంద్యాల ఎఫెక్ట్: ఆర్పిఎస్కు బైరెడ్డి గుడ్బై, అనుచరులతో సమావేశం, టిడిపిలోకి
కర్నూల్: నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు కారణమౌతున్నాయి. శిల్పా సోదరులు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నంద్యాల ఎన్నికల ఫలితాలు వైసీపీ శ్రేణులను ఆత్మరక్షణలో పడేశాయి. ఈ ఫలితాలతో వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని సమాచారం.
నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఫలితాలు టిడిపిలో ఉత్సాహన్ని నింపుతున్నాయి. వైసీపీ శ్రేణులను నిరాశకు గురిచేశాయి.
నంద్యాలలో వైసీపీ చీఫ్ జగన్ 13 రోజులపాటు ప్రచారం నిర్వహించినా ఆ పార్టీకి ఆశించినా ఫలితం రాలేదు. మరోవైపు రాయలసీమ వాదంతో ఎన్నికల బరిలోకి దిగిన రాయలసీమ ప్రజా సమితి నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది. కనీసం 200 ఓట్లు కూడ దక్కలేదు.
దీంతో రాయలసీమ ప్రజా సమితి నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి రాయలసీమ వాదాన్ని వదిలివేయాలని నిర్ణయం తీసుకొన్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో సమావేశం కానున్నారు. త్వరలో బైరెడ్డి టిడిపిలో చేరనున్నారు.
రాయలసీమ వాదంతో టిడిపికి దూరమైన బైరెడ్డి
2014 ఎన్నికలకు ముందుగా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో ప్రత్యేక రాయలసీమ కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటికి టిడిపిలో ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో చంద్రబాబునాయుడు చర్చించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ప్రత్యేక రాయలసీమ కోసం రాయలసీమ ప్రజాసమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి. టిడిపికి గుడ్బై చెప్పి ఆర్పిఎస్ను ఏర్పాటుచేసి ఎన్నికల బరిలోకి దిగారు. కానీ, 2014లో కానీ, ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో కూడ బైరెడ్డికి ఆశించిన ఫలితం దక్కలేదు.
ముచ్చుమర్రిలో ముఖ్యులతో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సమావేశం
రాయలసీమ ప్రజా సమితి నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి భవిష్యత్ కార్యాచరణ చర్చించేందుకు మంగళవారం ముచ్చుమర్రిలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలకు ఆయన ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక రాయలసీమ సాధన కోసం బైరెడ్డి 2013 అక్టోబరు 2వ తేదీ కేతవరం గ్రామం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించారు. రాయలసీమ జిల్లాల్లో నాలుగేళ్లపాటు పాదయాత్రలు, ట్రాక్టర్, బస్సు యాత్రలు చేసి సీమకు సాగు, తాగు నీటి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీకి స్వస్తి చెప్పేందుకు బైరెడ్డి సిద్ధమైనట్లు సమాచారం.
టిడిపిలో చేరేందుకు బైరెడ్డి సుముఖత
నంద్యాల ఉప ఎన్నికల్లో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఆర్పిఎస్ తరపున అభ్యర్థిని బరిలోకి దించారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో రెండువందల ఓట్లు కూడ దక్కలేదు.దీంతో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఆర్పిఎస్ కు స్వస్తి పలికేందుకు సిద్దమయ్యారు. అయితే నంద్యాల ఫలితం వచ్చిన తర్వాత సినీ నటుడు బాలకృష్ణ, మంత్రి పరిటాల సునీత సమక్షంలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి చర్చించారని సమాచారం. టిడిపిలో చేరేందుకు బైరెడ్డి ఆసక్తిని చూపారని సమాచారం.
వైసీపీ నుండి వచ్చినవారి పరిస్థితేమిటీ?
టీడీపీలో చేరేందుకు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. బైరెడ్డి టీడీపీలో చేరితే తమకు న్యాయం జరుగుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. బైరెడ్డి రాజకీయ కార్యాచరణ ప్రకటించేందుకు సభ ఏర్పాటు చేస్తుండడంతో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. బైరెడ్డి టీడీపీలోకి వస్తే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుల పరిస్థితి ఏమిటన్న దానిపై చర్చ జరుగుతుంది. ఆయన ప్రకటన కోసం నియోజకవర్గ ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.