నంద్యాల పోలింగ్: ఓటర్ల ఉత్సాహం, 80శాతానికిపైగా ఓటింగ్
అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ బుధవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు సాగనుంది.
నంద్యాల: అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ బుధవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే భారీగా ఓటర్లు చేరుకున్నారు. పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు సాగనుంది. నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2,19,108మంది ఓటర్లున్నారు.
- 2014 సార్వత్రిక ఎన్నికల్లో 72.44 శాతం పోలింగ్ జరిగింది.
- సాయంత్రం ఐదు గంటల వరకు 74 శాతం పోలింగ్ జరిగింది. గోస్పాడులో 81.14 శాతం పోలింగ్ జరిగింది.
- సాయంత్రం 4గంటల వరకు 70శాతానికిపై నమోదు కావడం గమనార్హం. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి భారీ స్థాయిలో పోలింగ్ నమోదు చేస్తున్నారు. దీంతో ఓటింగ్ సమయం పూర్తయ్యే సరికి 80శాతానికిపైగా ఓటింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండటంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
- 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యే అవకాశముంది.
Recommended Video
- నంద్యాల ఉప ఎన్నిక ముగిసింది. అయితే క్యూ లైన్లో నిలబడ్డ వారికి ఓటు వేసే అవకాశం ఉంది.
- మధ్యాహ్నం 2.30గంటల వరకు 60శాతానికిపైగా పోలింగ్ నమోదు.
- మధ్యాహ్నం 2గంటల వరకు 55శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది.
- మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.
-బుధవారం ఉదయం 11గంటల వరకు 33శాతం పోలింగ్ నమోదు.
- ఉదయం 10గంటల వరకు 25శాతం పోలింగ్ నమోదైంది.
- బుధవారం ఉదయం 9గంటల వరకు 17శాతం పోలింగ్ నమోదైంది.
ఓటేసిన శిల్పా, కుటుంబసభ్యులు
నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ఓట హక్కును వినియోగించుకున్నారు. సంజీవ్ నగర్ బూత్ నెం. 81కి కుటుంబసమేతంగా వచ్చిన శిల్పా.. ఓటు వేశారు. ప్రజల ఆశీర్వాదం తమకుంటుందని, ఓటు హక్కుని అందరూ వినియోగించుకోవాలని ఓటు వేసిన అనంతరం శిల్పా చెప్పారు.
పోటాపోటీ..
టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్తో కలిపి మొత్తం 15మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ నుంచి శిల్పా మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అబ్దుల్ ఖాదర్ ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్న కీలక అభ్యర్థులుగా చెప్పవచ్చు. బ్రహ్మానందరెడ్డి, శిల్పాల మధ్యే ప్రధాన పోటీ ఉంది. నంద్యాల ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచిచూడాల్సిందే.
కీలకంగా గోస్పాడు..
నంద్యాల ఉపఎన్నికల్లో అభ్యర్థి గెలుపునకు కీలకంగా మారననున్న గోస్పాడు మండలం. ఈ మండలంలో 28, 844ఓట్లు అభ్యర్థి గెలుపుపై ప్రభావం చూపనున్నాయి. దీబగుంట్ల, యాళ్లూరుకృష్ణాపురం, గోస్పాడులలో భారీగా పోలీసులు మోహరించారు. కాగా, ఇటీవలే గోస్పాడుకు చెందిన కీలక నేత ప్రతాప రెడ్డి టీడీపీలో చేరడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం.
మూడు కేంద్రాల్లో ప్రారంభం కాని పోలింగ్
117, 118, 121 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7.30గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఈవీఎంలలో సమస్యలున్నాయంటున్నారు సిబ్బంది. ఓటర్లు మాత్రం పోలింగ్ బూత్ల వద్ద క్యూకట్టారు. టీడీపీ, వైసీపీలు ఓటర్లను భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తుండటంతో ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది.
ఎన్నికల ఫలితాలు ఆగస్టు 28న వెల్లడి కానున్నాయి. నియోజకవర్గం మొత్తాన్ని సమస్యాత్మకంగా భావిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం 255 పోలింగ్ కేంద్రాలకు గానూ 25 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్మాత్మకంగా గుర్తించారు. మొత్తం రాష్ట్ర పోలీసులు 3500 మంది, 10 కంపెనీల కేంద్ర బలగాలను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.
ఆండ్రాయిడ్ యాప్..
కాగా, నంద్యాల ఉప ఎన్నికల భద్రతకోసం పోలీసులు అండ్రాయిడ్ యాప్ను రూపొందించారు. గుగూల్ ప్లేస్టోర్ నుంచి 'ఈ-మానిటరింగ్ యాప్ ఫర్ నంద్యాల బై ఎలక్షన్' అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వాటికి సంబంధించిన చిత్రాలు, సమాచారాన్ని ఫిర్యాదుల బాక్సుద్వారా తెలియజేయవచ్చు. యాప్ గురించి సందేహాలు ఉంటే 9966612718కు సంప్రదించవచ్చని పోలీసులు ప్రకటించారు.
ఓటు ఎవరికి వేసిందీ చూసుకునే అవకాశం
ఇది ఇలా ఉంటే ఓటు వేసిన వారు తాము ఏ పార్టీకి ఓటు వేసిందీ ఈ ఎన్నికల్లో 7సెకన్లపాటు చూసుకునే అవకాశం ఉంది. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి మరణంతో ఈ ఉపఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
దేశంలోనే మొదటిసారి..
దేశంలో మొట్టమొదటిసారి బాడీ ఓర్న్ కెమెరాలతో నిఘా చేస్తుండటం గమనార్హం. కాగా, ఈ ఉపఎన్నికల్లో వీవీపాట్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అంతేగాక, పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కాగా, చివరి ప్రయత్నంగా మంగళవారం రాత్రి నంద్యాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు ప్రయత్నాలు సాగించడం గమనార్హం.