ఒప్పించిన నారా లోకేష్: ఆ టూర్ తో సత్ఫలితాలు
Nara Lokesh Singapore visit: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. భారీగా పెట్టుబడులను సాధించే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు, వివిధ మల్టీ నేషనల్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ముఖాముఖి సమావేశమౌతోన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వారికి వివరిస్తోన్నారు.

ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్.. తాజాగా యూట్యూబ్ అండ్ టెస్సెరక్ట్ సంస్థల యాజమాన్యంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఏపీలో క్రియేటర్ అకాడమీని స్థాపించడం అవగాహన ఒప్పందాల ముఖ్య ఉద్దేశం.
యువతకు నైపుణ్యాన్ని కల్పించడానికి, సాధికారత సాధించడానికి ఈ అకాడమీ పని చేస్తుంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు, యువతల్లో వివిధ టెక్నాలజీ కోర్సులు, అకడమిక్ లో శిక్షణ, నైపుణ్యాన్ని ఇప్పించడానికి కృషి చేస్తుంది క్రియేటర్ అకాడమీ.
ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. షాంగ్రీలా హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టెజారాక్ట్ ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ప్రభుత్వం ఐటి కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంఓయుపై సంతకాలు చేశారు.
#APatSingapore
— Lokesh Nara (@naralokesh) July 29, 2025
సింగపూర్ పర్యటనలో మూడో రోజు ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. షాంగ్రీలా హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టెజారాక్ట్, US Inc. ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ… pic.twitter.com/Uiz8WDJXGr
ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనుంది. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
అలాగే- గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్ తో నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్ లను రూపొందిస్తున్నందున వైజాగ్ లోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్ లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే ఎంఓయులు చేసుకున్న ప్రాజెక్టులతో పాటు ఏపీ ప్రతిపాదనలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని డ్రూ బ్రైన్స్ చెప్పారు. అంతకుముందు- సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో నారా లోకేష్ ప్రసంగించాను. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక... ఆ ప్రాజెక్టు పూర్తి బాధ్యత తమదేనని అన్నారు.
ఆ తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు, సౌకర్యాలు కల్పిస్తామని, అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ఏపీ ప్రభుత్వం సింగపూర్ సహకారాన్ని కోరుకుంటున్నట్లు వివరించారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో పరిశ్రమదారులకు మద్దతుగా నిలుస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications