లోకేష్ ట్రాప్లో జూ.ఎన్టీఆర్ చిక్కుతారా.. గర్జిస్తారా?నందమూరి అభిమానుల్లో హాట్ డిస్కషన్
నారా వారి వారసుడు నందమూరి వారసుడి వైపు ఆసక్తిగా చూస్తున్నారా..? జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి అవసరమని ఆలస్యంగానైనా గుర్తించారా..? నారా అభిమానులు సైతం పరోక్షంగా ఇదే విషయాన్ని లోకేష్కు తేల్చి చెప్పారా..? వీటన్నిటికీ ఒకే ఒక్క ట్వీట్ అవుననే సమాధానం ఇస్తోంది. 2009 ఎన్నికల ప్రచారంలో సునామీలా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ ప్రాబల్యం పెరిగేసరికి అంతే వేగంగా సైలెంట్ అయ్యారు.
2014లో లోకేష్ మంత్రి అయిన తర్వాత జూనియర్ పొలిటికల్ కెరీర్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పని చేయాల్సిందేనంటూ పరోక్షంగా జూనియర్కు సూచించారు. అయితే కాలంమారింది. జూనియర్ ఎన్టీఆర్ అనుచరులు నేడు వైసీపీలో కీలక పదవుల్లో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకు నారా లోకేష్ చేసిన ట్వీట్ దానికి వచ్చిన రియాక్షన్స్ ఎంటైర్ టీడీపీలో కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇదే హాట్ టాపిక్.
జూనియర్ రీఎంట్రీ కోసం టీడీపీ పావులు కదుపుతోందా..?
నాలుగు దశాబ్దాలకు చేరువవుతున్న తెలుగుదేశం పార్టీ గట్టి పట్టున్న తెలంగాణలో ప్రాభవం కోల్పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్ల పాటు పాలించిన ఏపీలోనూ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇష్టం ఉన్నా లేకున్నా అన్ని పరిణామాలను భరించిన పార్టీ నేతలు అధికారం కోల్పోగానే తమ వాయిస్ను పెంచారు. ప్రత్యేకంగా లోకేష్ను టార్గెట్ చేశారు. ఇదే సమయంలో వైసీపీ కూడా గతంలో టీడీపీ చేసిన విధంగానే పార్టీ నేతలను ఆకర్షించే పనిలో సగం పని పూర్తి చేసింది. ఇక జగన్ను ఎదుర్కోవాలంటే టీడీపీలో స్టార్ క్యాంపెయినర్ కావాల్సిందేనని పార్టీ నేతలు ముక్తకంఠంతో చేస్తున్న నినాదం.
తన తాత పెట్టిన పార్టీకి తానెప్పుడు సిద్దమేనంటూ...
ఒకరకంగా పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే నందమూరి వారసులకు ప్రాధాన్యత అవసరమని వాదిస్తున్నారు. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ తిరిగి పార్టీలో కీలక పాత్ర పోషించాలనే కోరిక చాలామంది టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన సమర్థతను ఆనాడే చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సడెన్గా ప్రచారంకు దూరమయ్యారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు టీడీపీలో క్రియాశీలకంగా మాత్రం వ్యవహరించడం లేదు. తన తాత పెట్టిన పార్టీకి తన సేవలు ఎప్పుడు అవసరమైనా తాను సిద్ధమేనంటూ కొన్నేళ్ల క్రితమే జూనియర్ స్పష్టం చేశారు. కానీ ఎన్టీఆర్ జయంతి వర్ధంతి సందర్భాల్లో మినహా రాజకీయంగా ఎక్కడా కనిపించడం లేదు.
లోకేష్ కోసం జూనియర్ దూరం
2014 ఎన్నికల్లో బీజేపీ పవన్ కళ్యాణ్తో టీడీపీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. 2009లో జూనియర్ ఎన్టీఆర్ను వినియోగించుకున్న టీడీపీ 2014లో పవన్కు ఇచ్చిన ప్రాధాన్యత కారణంగా జూనియర్ను పరిగణలోకి తీసుకోలేదు. అంతే వ్యూహాత్మకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిననాటి నుంచి తన కుమారుడిని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. తొలుత కార్యకర్తలకు దగ్గర చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి, మంత్రిని చేయడం పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టడంవంటివి ఈ స్ట్రాటజీలో భాగమే. ఇక ఏపీలో తమ అధికారానికి ఇబ్బంది లేదని భావించిన నారా ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ను మాత్రం రాజకీయంగా ప్రోత్సహించేందుకు సాహసించలేదు.
టీడీపీ కొత్త స్ట్రాటజీతో వస్తోందా..?
జూనియర్ను ప్రమోట్ చేస్తే పరోక్షంగా లోకేష్ రాజకీయ భవితవ్యంపై ప్రభావం చూపుతుందన్నది ఒక అంచనా. దీంతో జూనియర్ సైతం పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. లోకేష్ పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. కానీ 2019 ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయ్యింది. జగన్కు వచ్చిన సీట్లు ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి పెరుగుతున్న వలసలు ఆ పార్టీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న కొడాలి నాని, టీడీపీని కాదనుకున్న వల్లభనేని వంశీలాంటి వారు లోకేష్ను విమర్శిస్తూ జూనియర్ ఎన్టీఆర్పైన తమ అభిమానం చాటుకుంటున్నారు. దీంతో వైసీపీ 2024 లక్ష్యంగా కొత్త వ్యూహం అమలు చేస్తోందనే అంచనాకు వచ్చింది. దీనికి కౌంటర్గా మరో వ్యూహాన్ని టీడీపీ తెరపైకి తీసుకొచ్చింది.
ఒక్క ట్వీటు... వంద సమీకరణాలు
లోకేష్ కారణంగానే జూనియర్కు పార్టీలో సరైన గుర్తింపులేదనే వాదనకు తెరదించాలని చంద్రబాబు అండ్ కో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలోను ఈ ప్రయత్నాలు జరిగాయి. బాలకృష్ణకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినా నందమూరి కుటుంబంలో సంతృప్తి లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినీని కూకట్పల్లి ఎమ్మెల్యేగా వ్యూహాత్మకంగా రంగంలోకి దించడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్లో సాఫ్ట్ ఒపీనియన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ జూనియర్ మాత్రం సోదరి ప్రచారానికి రాజకీయాలకు దూరం అనే స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకు శుభాకాంక్షలు చెబుతూ నారా లోకేష్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. నారా లోకేష్ చేసిన ట్వీట్ ను ఏకంగా 8391 మంది రీట్వీట్ చేయగా..15800 లైక్స్ వచ్చాయి. లోకేష్ చేసిన ట్వీట్స్ లో బహుశా అత్యధిక రీట్వీట్, లైక్ లు వచ్చిన ట్వీట్ ఇదేనని చెబుతున్నారు.
Recommended Video
విశ్లేషకులు ఏం చెబుతున్నారు
దీని ద్వారా రానున్న రోజుల్లో సమీకరణాలు ఆధారంగా జూనియర్ ఎన్టీఆర్ను తమ బ్రహ్మాస్త్రంగా మలుచుకునేందుకు ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగా తొలి అడుగు లోకేష్ నుంచే ప్రారంభమైంది. నారా అభిమానులు సైతం పార్టీకోసం లోకేష్ జూనియర్ కలవాల్సిందేనన్న సంకేతాలు ఈ రీట్వీట్లు, లైకుల ద్వారా స్పష్టం చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ట్వీట్లకు జూనియర్ స్పందించకపోవడంతో మరో చర్చకు కారణమైంది. రానున్న రోజుల్లో లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ల ఎపిసోడ్ అటు టీడీపీలోనూ ఇటు ఏపీ పాలిటిక్స్లోను కీలక మలుపులకు కారణం కానుంది.