ఏపీలో సచివాలయాలు, వాలంటీర్ల తొలగింపు ! లోకేష్ క్లారిటీ - ఉద్యోగులకు హామీ..
ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే ముందుగా తుపాకీ పేలేది మీపైనే అంటూ తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన హెచ్చరికలపై టీడీపీ యువనేత నారా లోకేష్ ఇవాళ స్పష్టత ఇచ్చారు.
యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్.. ఇవాళ చిత్తూరు నియోజకవర్గం కృష్ణాపురం గ్రామంలో యువతతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ రద్దవుతాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపైనా స్పందించారు.
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థలో కేజీ టు పీజీ సిలబస్ మారుస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగావకాశాలు లభించేలా నైపుణ్యతతో కూడిన విద్యను ప్రవేశపెడతామన్నారు. మాతృభాషలో విద్యావ్యవస్థ కొనసాగుతుందని, ఇంగ్లీషు మీడియం కూడా ఉంటుందన్నారు.
ఇవన్నీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే పూర్తిచేస్తామన్నారు. చదువుపై అవగాహన లేనివాడు సీఎం కావడం వల్ల రాష్ట్ర విద్యావ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని లోకేష్ ఆరోపించారు.

పేదవాళ్లు పీజీ చదవకూడదనే దురుద్దేశంతో ప్రభుత్వం జీఓ 77తెచ్చిందని, దీనివల్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిలిపేశారన్నారు. ఫలితంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు డిగ్రీతోనే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని లోకేష్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాను కూడా దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగిలే చూస్తామన్నారు. చంద్రబాబుతో మాట్లాడి చిత్తూరులో ప్రభుత్వ యూనివర్శిటీకి కృషి చేస్తామన్నారు. కొత్త కంపెనీలను కూడా రప్పించి యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి లేకుండా చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
మరోవైపు చంద్రబాబు సీఎం అయ్యాక సచివాలయాల ఉద్యోగాలు తీసేస్తారని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని లోకేష్ ఆరోపించారు. ప్రక్షాళనచేసి సచివాలయాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ఉద్యోగులెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ఏ పరిశ్రమకూ ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదన్నారు. పరిశ్రమలన్నీ విద్యుత్ ఛార్జీలు,పన్నులకు భయపడి పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయని లోకేష్ ఆరోపించారు. వీటికి తోడు జగన్ కమీషన్లు కట్టలేక కంపెనీలన్నీ ఏపీని వదిలేస్తున్నాయన్నారు..












Click it and Unblock the Notifications