జాతీయ జెండాను అవమానించిన నారా లోకేష్?
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ జెండాను అవమానించే విధంగా ప్రవర్తించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేసిన వంద అడుగుల ఎత్తైన భారీ జాతీయ జెండాను ముఖ్యమంత్రి.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ జెండాను అవమానించే విధంగా ప్రవర్తించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేసిన వంద అడుగుల ఎత్తైన భారీ జాతీయ జెండాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఆవిష్కరించారు.
అయితే, జెండా ఎగురవేసే సమయంలో అందరూ జెండాకు గౌరవ వందనం చేశారు. కానీ నారా లోకేష్ మాత్రం జెండాకు వందనం చేయలేదు. సుమారు మూడు నిమిషాల పాటు ముఖ్యమంత్రితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులందరూ జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తే మంత్రి మాత్రం నిశబ్దంగా ఉండిపోయారు. మంత్రి పదవిలో ఉన్న లోకేష్ ఇలా వ్యహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అభివృద్ధికి చిరునామా ఏపీ
అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్.. హార్డ్వేర్, సెల్ఫోన్ సంస్థలకు తిరుపతి కేరాఫ్ అడ్రస్గా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో సెల్కాన్ మొబైల్ ఫోన్ల యూనిట్ను గురువారం ఆయన ప్రారంభించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.150కోట్లతో ఈ యూనిట్ నెలకొల్పారు. ఈ సందర్భంగా యూనిట్లో తయారైన తొలి ఫోన్ను చంద్రబాబు ఆవిష్కరించారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఇక్కడ పుట్టిన వ్యక్తి పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇక్కడే పరిశ్రమ పెట్టి స్థానికులకు ఉపాధి కల్పించడం గర్వకారణమన్నారు. తిరుపతికి దేశ విదేశాలకు చెందిన ఎన్నో విద్యాసంస్థలు వస్తున్నాయని, ఈ నగరం త్వరలోనే ఎడ్యుకేషనల్ హబ్గా మారుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తాం. ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి ఆగదు' అని చంద్రబాబు అన్నారు.
అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. తాను చిన్నపుడు రేణిగుంట ఎయిర్పోర్టు రోడ్డు నుంచి నారావారిపల్లెకు వెళ్లే వాడినని మంత్రి లోకేష్ అన్నారు. ఇదే రోడ్డులో ఓ సెల్ఫోన్ కంపెనీ వస్తుందని ఊహించలేదని మంత్రి లోకేష్ తెలిపారు. ఊహించని అభివృద్ధి అంటే ఇదేనని మంత్రి లోకేష్ స్పష్టంగా చెప్పారు. రాబోయే రెండేళ్లలో 7 లక్షల ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ వెల్లడించారు. 2019 లోపు రేణిగుంట క్లస్టర్లో లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని మంత్రి లోకేష్ అన్నారు.