బాబు ప్లాన్, కేబినెట్లోకే లోకేష్: వైసిపి నుంచి వచ్చిన వారికి చేయిస్తారా?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు కౌంటర్గా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఢిల్లీకి (ఎంపీగా లేదా కేంద్రమంత్రిగా) పంపిస్తారనే ఊహాగానాలకు టిడిపిలో తెరపడిందని అంటున్నారు. ఆయనను ఏపీ కేబినెట్లోకి తీసుకునేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
వచ్చే సెప్టెంబర్ నెలలో లోకేష్ను కేబినెట్లోకి తీసుకునే అవకాశం లేకపోలేదని వార్తలు వస్తున్నాయి. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు కూడా ఆ కోణంలో కనిపిస్తోందని అంటున్నారు.
తాత్కాలిక సచివాలయంలో మరో ముగ్గురు మంత్రులకు ఛాంబర్లు కేటాయించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. లోకేష్ను ఏపీ కేబినెట్లోకి తీసుకుంటారనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చంద్రబాబు దీనిపై డైలమాలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఏపీలో చక్రం తిప్పాలంటే
ఓ సమయంలో అతను కేంద్ర కేబినెట్లోకి వెళ్లవచ్చుననే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ లోకేష్ను రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేలా చేయాలంటే ఏపీ కేబినెట్లోకి తీసుకోవడమే ఉత్తమమని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది.
మైనార్టీలకు మంత్రి పదవి
ప్రస్తుతం ఏపీ కేబినెట్లో మైనార్టీ మంత్రి లేరు. వైసిపి నుంచి వచ్చిన ఓ ఎమ్మెల్యేకు మైనార్టీ మంత్రిత్వ శాఖను అప్పగించనున్నారని తెలుస్తోంది. అతనితో పాటు లోకేష్కు కూడా మంత్రి పదవి ఇవ్వవచ్చునని అంటున్నారు. లోకేష్కు ముఖ్యమైన పోర్ట్ పోలియో ఇవ్వవచ్చునని అంటున్నారు. చంద్రబాబు ప్రస్తుతం చూస్తున్న ఏదైనా శాఖను అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు.
నారాయణ లాబీయింగ్
మంత్రి నారాయణ విజయనగరం జిల్లాకు చెందిన గుమ్మడి సంధ్యారాణికి ఎమ్మెల్సీ ఇచ్చేవిధంగా చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈమె ఎస్టీ. తద్వారా ఆమెను కూడా కేబినెట్లోకి తీసుకోవచ్చునని అంటున్నారు. ఓ ముస్లీం, ఓ ఎస్టీ, లోకేష్. ఈ ముగ్గురి కోసం తాత్కాలిక సచివాలయంలో చాంబర్లు సిద్ధం కావాలని చంద్రబాబు సూచించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్టీ ఎమ్మెల్యే టీడీపీలో శ్రీనివాస్ రావు ఒక్కరే ఉన్నారు. అతను కూడా మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు.
మంత్రి పదవి ఎవరికి?
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షరీఫ్ను చంద్రబాబు ఎమ్మెల్సీ చేశారు. ఆయనకు మంత్రి పదవి రావొచ్చంటున్నారు. వైసిపి నుంచి చేరిన వారికి ఇస్తారా, లేక ఇతనికి ఇస్తారా అనే చర్చ సాగుతోంది. ఎస్టీ ఎమ్మెల్యే శ్రీనివాస రావు, షరీఫ్.. ఇరువురు కూడా వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారు. దీంతో, ఎవరో ఒకరికే మంత్రి పదవి దక్కనుందని అంటున్నారు.
మంత్రి పదవి ఎవరికి?
కేబినెట్లో చోటు గోదావరి జిల్లా షరీఫ్కు ఇస్తే విజయనగరం జిల్లా సంధ్యారాణికి, శ్రీనివాస రావుకు ఇస్తే మాత్రం సంధ్యారాణికి దక్కక పోవచ్చంటున్నారు. షరీఫ్కు ఇస్తే వైసిపి నుంచి వచ్చిన ముస్లీం ఎమ్మెల్యేలకు చేయి ఇచ్చినట్లే భావించవచ్చునంటున్నారు. ఇప్పటికే బీజేపీ మాణిక్యాల రావు ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు.
ఏపీ కేబినెట్
కేబినెట్లోకి ఎవరిని తీసుకుంటారనే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. ప్రధానంగా షరీఫ్, వైసిపి నుంచి వచ్చిన జలీల్ ఖాన్, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస రావు, విజయనగరంకు చెందిన సంధ్యా రాణిల పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణా పుష్కరాల అనంతరం కేబినెట్ విస్తరణ ఉంటుంది.