పుష్కరాల తర్వాత విస్తరణ: బాబుమంత్రివర్గంలోకి నారా లోకేష్?
విజయవాడ: తన మంత్రివర్గంలోకి కుమారుడు నారా లోకేష్ను తీసుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకుని ఎమ్మెల్సీగా పోటీ చేయించడమో లేదా గవర్నర్ కోటాలో మండలి పంపడమో చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
మంత్రి వర్గ విస్తరణకు సమయం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. కృష్ణా పుష్కరాల తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీపరంగా మహానాడు, మహాసంకల్ప దీక్షలు పూర్తయ్యాయి. ఈ నెలలో రాజధానికి పాలనావ్యవస్థ తరలింపు ప్రక్రియ పూర్తిచేసి, ఆపై విస్తరణపై దృష్టి సారించాలని చంద్రబాబు అనుకుంటున్నారు.
ప్రస్తుతం శాసనమండలిలో 58 మందికి గాను టిడిపికి 38 మంది సభ్యుల బలం ఉంది. వచ్చే మార్చిలో మరో 22 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడుతుంది. వీటిలో ఏడు సీట్లు ఎమ్మెల్యే కోటా, రెండుసీట్లు గవర్నర్ కోటాలోవి కాగా మిగిలినవి పట్ట్భద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థలకు సంబంధించిన ఖాళీలు. ఆగస్టులో పుష్కరాలు వస్తాయి.
సెప్టెంబర్లో మంత్రివర్గ విస్తరణ జరిపితే ఆరు నెలలలోగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశముందని, దీనివల్ల ఎలాంటి సమస్యలు కూడా తలెత్తవని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటివరకు లోకేష్ను రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఆ ఆలోచనకు స్వస్తిచెప్పాలని పార్టీ నేతలు ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలిసింది.
ఒకవేళ లోకేష్కు రాజ్యసభ సీటు ఇస్తే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదా, నిధుల విషయంలో జాప్యం చేస్తున్నందున ఆ ప్రభావం ఆయనపై ఉంటుందని, ప్రత్యేకించి అది ముఖ్యమంత్రి, లోకేష్ల వైఫల్యంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారం చేస్తాయని, దానివల్ల నష్టం జరుగుతుందని వారు చెప్పినట్లు సమాచారం.
మంత్రివర్గ విస్తరణలో లోకేష్కు చోటు కల్పించి ఆరునెలల్లో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు చెప్తున్నారు. మార్చిలో ఖాళీ అయ్యే స్థానాల్లో అసమ్మతివాదులు, వలసలకు ప్రాధాన్యమివ్వాలని కూడా భావిస్తున్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి పదవీకాలం మరో ఏడాది ఉన్నందున ఈలోగా లోకేష్తోపాటు మరికొందరు కీలక నేతలను పెద్దల సభకు పంపే యోచనతో ఉన్నట్లు తెలిసింది.